బాబుపై ఒత్తిళ్లు: ఎపి రాజధానిపై దేవినేని ఉమ
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విషయంలో తమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై ఎన్నో ఒత్తిళ్లు వచ్చాయని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు చెప్పారు. 13 జిల్లాలకు అందుబాటులో రాజధాని పెట్టాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. విజయవాడ-గుంటూరు స్మార్ట్ సిటీల మధ్య మధ్య ప్రపంచస్థాయి రాజధానిని నిర్మిస్తామని మంత్రి తెలిపారు.
రాజధానికి రైతులు ఆనందంగా భూములిస్తున్నారని వెల్లడించారు. బందరుపోర్టు పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, అలాగే గన్నవరం ఎయిర్పోర్టును అంతర్జాతీయ స్థాయికి తీసుకువస్తామని మంత్రి దేవినేని ఉమా మంగళవారం మీడియా ప్రతినిధుల వద్ద స్పష్టం చేశారు.
హెచ్ఎల్సీ ఆధునీకరణ చేపట్టకపోవడం వల్ల అనంతపురం జిల్లాకు సాగునీటి కష్టాలు ఏర్పడ్డాయని, ఏపీ సీఎం చంద్రబాబు చొరవతో నీటి కష్టాలు తీరనున్నాయని మంత్రి దేవినేని ఉమా అన్నారు. హెచ్ఎల్సీ ఆధునీకరణ పనులు త్వరలో ప్రారంభంకానున్నట్లు తెలిపారు. తుంగభద్ర కాలువల ఆధునీకరణకు కర్నాటక సానుకూలంగా ఉందని ఆయన చెప్పారు. పొరుగు రాష్ర్టాలతో సత్సంబంధాలు కోరుకుంటున్నామని వెల్లడించారు.
ఏపీ ప్రభుత్వం చేపట్టిన జన్మభూమి కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చిందన్నారు. విజయవాడ చుట్టుపక్కల రాజధాని అని స్పష్టంగా చెప్పామని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బెంగళూర్ వెళ్లి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో చర్చించిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. తుంగభద్ర ఆధునీకరణ కార్యక్రమాలు చేపడుతామని చెప్పారు.