పులివెందుల కాదు.. బయటకు రా!: జగన్కు దేవినేని, 'పవన్ ఆ మాటలు ఆశ్చర్యం'
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లపై టీడీపీ నేతల మాటల దాడి కొనసాగుతోంది. జగన్కు దమ్ముంటే పులివెందుల కాకుండా బయటకు వచ్చి గెలవాలని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు సోమవారం సవాల్ చేశారు.
జగన్ తన నియోజకవర్గమైన పులివెందులకు వెళ్లి తమ ప్రభుత్వం ఇచ్చిన నీళ్లు చూడాలన్నారు. రాయలసీమలో నీళ్లు జగన్కు కనపడవని, రానున్న రోజులలో జగన్కు పులివెందుల ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. హోదా వంటి ఎన్నో అంశాలపై జగన్ డ్రామాలు ఆడతున్నారన్నారు.
అమరావతిపై కుట్రలో కేంద్రం హస్తం: పవన్ వ్యాఖ్యలపై టిడిపి అనుమానం
40 సంవత్సరాలుగా తమ కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టిన ప్రాంతానికి వైయస్ రాజశేఖర రెడ్డి నీళ్ళు ఇవ్వలేక పోయారన్నారు. జగన్కు ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని మండిపడ్డారు. నందిగామను వదిలి తాను రెండుసార్లులు గెలిచానని, తనలాగే జగన్ పులివెందుల నుంచి బయటికి వచ్చి గెలవాలని సవాల్ చేశారు.
రాజకీయాల్లో కనీస విలువలు లేకుండా పోయాయని మంత్రి నక్కా ఆనంద్ బాబు వేరుగా వాపోయారు. ప్రజాస్వామ్యంపై జగన్, పవన్ కళ్యాణ్లు మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడమే టీడీపీ సర్కార్ లక్ష్యమని చెప్పారు. 12 కేసుల్లో ఉన్న ముద్దాయిపై కేంద్రానికి అంత ప్రేమ ఎందుకో చెప్పాలని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు చరిష్మాకు ప్రధాని నరేంద్ర మోడీ భయపడుతున్నారని నక్కా ఆనంద్ బాబు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చేతిలో జగన్, పవన్లు కీలుబొమ్మలు అన్నారు. ప్రజా రాజధానిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.