'చంద్రబాబు అలా కష్టపడి ఇల్లు కట్టారు, జగన్ లోటస్ పాండ్ మాటేమిటి'
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ ఇంటిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు సోమవారం నాడు అన్నారు.
హైదరాబాద్/విజయవాడ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ ఇంటిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు సోమవారం నాడు అన్నారు.
25 ఏళ్ల పాటు హెరిటేజ్ కోసం చంద్రబాబు కుటుంబం కష్టపడిందని, ఆ కష్టపడిన సొమ్ముతో హైదరాబాదులో ఇంటిని నిర్మించారని దేవినేని స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు.
విదేశీ టెక్నాలజీ, రూ.కోట్లు ఖర్చు: హైదరాబాద్లో చంద్రబాబు విలాసవంత భవనం ఇదే!
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి రూ.300 కోట్లతో అదే హైదరాబాదులో ఇంటిని నిర్మించారని, ఆ ఇంటి నిర్మాణం అక్రమంగా వచ్చిన సొమ్ముతో కట్టారన్నారు. కాలం చెల్లిన కాంగ్రెస్ నేతలు తమపై ఆరోపణలు చేస్తున్నారన్నారు.
అందుకే దేవినేని కౌంటర్
రెండు రోజులుగా వైసిపి నేతలు, జగన్కు చెందిన సాక్షి పత్రిక హైదరాబాదులోని చంద్రబాబు ఇంటిపై విమర్శలు చేస్తోంది. దీనిపై దేవినేని కౌంటర్ ఇచ్చారు.
ఇదిలా ఉండగా, జూబ్లీహిల్స్లో కొత్తగా నిర్మించిన ఇంట్లో ఆదివారం వాస్తు పూజ, హోమం నిర్వహించారు. ఇది రాత్రి వరకు కొనసాగింది. సోమవారం ఉదయం గృహప్రవేశం. ఈ కార్యక్రమానికి నారా, నందమూరి కుటుంబాల సభ్యులు మాత్రమే హాజరయ్యారు.
పూజలు నిర్వహించారు
చూపరుల కళ్లు చెదిరేలా, ఇంద్రభవ నాన్ని తలపించేలా అత్యంత విలాసవంతంగా హైదరాబాద్లోని జూబ్లిహిల్స్లో అర ఎకరం విస్తీర్ణంలో నిర్మించుకున్న ఇంటిలోకి చంద్రబాబు కుటుంబం అడుగు పెట్టింది. చంద్రబాబు కుటుంబంతో పాటు తన వియ్యంకుడు బాలకృష్ణ కుటుంబం, మరో మూడు అతి సన్నిహిత కుటుంబాల మధ్య భవనంలో వాస్తుపూజ, యజ్ఞంతో పాటు ఇతర వ్రతాలను నిర్వహించారు.
ఎవరికీ ఆహ్వానం లేదు
ఆదివారం తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన పూజల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. అనంతరం విశ్రాంతి కోసం ఇప్పటి వరకూ ఆయన కుటుంబం నివసించిన పార్క్ హయత్ హోటల్కు వెళ్లారు. ఆ తర్వాత రాత్రి ఎనిమిదిన్నర గంటలకు చంద్రబాబు తన నూతన గృహానికి చేరుకుని అక్కడే భోజనం చేసి రాత్రి నిద్ర చేశారు. చంద్రబాబు గృహ ప్రవేశ వేడుకకు ఏపీ, తెలంగాణకు చెందిన నాయకులు, మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలకు.. ఎవరికీ ఆహ్వానం లేదు.
ఇంటి చుట్టు పహారా
గృహప్రవేశానికి ముందు.. చంద్రబాబు నివాసానికి వెళ్లే రోడ్ నెంబర్ 65ను ఏపీ పోలీసులు పూర్తిగా స్వాధీనంలోకి తీసుకున్నారని వార్తలు వచ్చాయి. ఇంటి చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు ఆ మార్గంలో ఏకంగా 26 సీసీ కెమేరాలు ఏర్పాటు చేసి చంద్రబాబు ఇంటికి అనుసంధానం చేశారట.
ఫోటోలు తీయవద్దని.
చంద్రబాబు గృహ ప్రవేశాన్ని కవర్ చేసేందుకు వచ్చిన వివిధ ఛానెళ్లు, పత్రికల ప్రతినిధులను రోడ్డు పైనే నిలిపేసి అనుమతి లేదంటూ వెనక్కి పంపించారు. సెల్ఫోన్లో చంద్రబాబు నివాసాన్ని చిత్రీకరించిన జర్నలిస్టుల ఫోన్లను పోలీసులు లాక్కొని ఫొటోలను తొలగించారట.