అప్పుడు వైయస్, ఇప్పుడు జగన్: దేవినేని ఉమ
కర్నూలు: గతంలో వైఎస్ రాజశేఖర్రెడ్డి తెలుగుగంగకు అడ్డుపడినట్లే పట్టిసీమను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అడ్డుకునేందుకు కుట్ర పన్నుతున్నాడని రాష్ట్ర మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు ఆరోపించారు. హంద్రీనీవాకు వేలకోట్ల రూపాయలు ఖర్చు చేసినా రెండు పంపులు మాత్రమే ఎందుకు పనిచేస్తున్నాయో జగన్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
హంద్రీనీవాతో 40 టీఎంసీలు, గండికోట నుంచి 20 టీఎంసీలు రాయలసీమకు అందిస్తామన్నారు. హెచ్ఎల్సీ, ఎల్ఎల్సీపై కర్ణాటకతో చర్చిస్తామని మంత్రి దేవినేని ఉమా చెప్పారు. పట్టిసీమ ప్రాజెక్టును ఏడాదిలోగా పూర్తి చేసి రాయలసీమకు పుష్కలంగా తాగునీరు అందిస్తామని ఆయన చెప్పారు.
కర్నూలులోని ప్రభుత్వ అతిథి గృహంలో ఆయన గురువారంనాడు టిడిపి నేత పయ్యావుల కేశవ్తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజలను మభ్య పెట్టేందుకే జగన్ బస్సు యాత్ర చేపట్టారని ఆయన అభిప్రాయపడ్డారు.
జగన్ ఎన్ని కుట్రలు చేసినా పట్టి సీమను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. పట్టిసీమతో పాటు రాయలసీమలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తామని ఆయన చెప్పారు
ప్రిత ఎకరాకు సాగు నీరు అందించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని పయ్యావుల కేశవ్ చెప్పారు. పట్టిసీమ పూర్తయితే రాయలసీమ జిల్లాలకు మేలు జరుగుతుంని కోస్తా ప్రజలను జగన్ రెచ్చగొట్టడం భావ్యం కాదని ఆయన అన్నారు. బస్సు యాత్ర నిలిపేసి జగన్ పార్టీని కాపాడుకోవాలని ఆయన సూచించారు.