జగన్ క్షమాపణ చెప్పు: దేవినేని, 'అడిగితే కొడతారా, వెంకయ్యకు సత్తా ఉంటే తేవాలి'
విజయవాడ: పట్టిసీమ ప్రాజెక్టు దండుగ అని చెప్పిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలని ఏపీ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు సోమవారం డిమాండ్ చేశారు.
ఇప్పటి వరకు పట్టిసీమ నుంచి రెండు టీఎంసీల నీరు ప్రకాశం బ్యారేజీకి చేరిందన్నారు. ఈ నెల నుంచి పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేస్తున్నామన్నారు. ఇదిలా ఉండగా, జలవనరుల శాఖకు అదనంగా రూ.3 వేల కోట్లను విడుదల చేయాలని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణ ఆదేశాలు జారీ చేశారు. ఇరిగేషన్కు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందన్నారు.
బెదిరింపులకు భయపడరు: శైలజానాథ్
విజయవాడలో విద్యార్థుల పైన బిజెపి చేసిన దాడిని ఖండిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శైలజానాథ్ అన్నారు. బెదిరింపులకు ఏపీ ప్రజలు భయపడరన్నారు. ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామన్నారు.
విద్యార్థులపై జరిగిన దాడి ఏపీ ప్రజల పైన జరిగిన దాడిగా భావిస్తున్నామన్నారు. ప్రత్యేక హోదా అడిగితే దాడి చేయడం అమానుషమన్నారు. శైలజానాథ్ హైదరాబాదులో మీడియాతో మాట్లాడారు.
వెంకయ్యకు సత్తా ఉంటే ప్రత్యేక హోదా ఇప్పించాలి: రామకృష్ణ
కేంద్రమంత్రి వెంకయ్యనాయుడికి సత్తా ఉంటే ఏపీకి ప్రత్యేక హోదా ఇప్పించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సవాల్ చేశారు. లేదంటే తన పదవికి వెంటనే రాజీనామా చేయాలన్నారు. రాష్ట్రంలోని ప్రతి కళాశాల, విశ్వవిద్యాలయానికి వెళ్లి రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని వివరిస్తామన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాని మోడీ, వెంకయ్యల దిష్టిబొమ్మలను దహనం చేస్తామన్నారు.ప్రత్యేక హోదా అడిగిన విద్యార్థులను బీజేపీ నేతలు కొడతారా? అని ప్రశ్నించారు. అరెస్టు చేసిన విద్యార్థులను విడిచిపెట్టి బీజేపీ కార్యకర్తలపై కేసులు పెట్టాలన్నారు. ఈ నెల 14న జలదీక్ష, డిసెంబర్ 2న ఢిల్లీలో ధర్నా చేస్తామన్నారు.