దమ్ముంటే వీటిపై ట్వీట్ చెయ్ .. నువ్వా నీతి సూత్రాలు వల్లించేది .. విజయసాయిపై దేవినేని ఫైర్
వైసీపీ నేత , రాజ్య సభ సభ్యుడు విజయసాయి రెడ్డి మాజీ మంత్రి టీడీపీ నేత దేవినేని ఉమా పై చేసిన వ్యాఖ్యలపై ఉమా స్పందించారు. వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డివ్యాఖ్యలపై టీడీపీ నేత దేవినేని ఉమ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రాజెక్టుల పనులకు సంబంధించి రివర్స్ టెండరింగ్ అనగానే మీ నాయకుడు చంద్రబాబుకు, నీకు వెన్నులో వణకు పుడుతుందా అంటూ విజయసాయి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. అలాగే పోలవరం ప్రాజెక్టులో దోచుకున్న ప్రతి రూపాయిని కక్కిస్తామని చేసిన హెచ్చరికలకు ఘాటుగా బదులిచ్చారు దేవినేని ఉమా .
Recommended Video
ఇంటర్ పోల్ నిందితులు మీరు.. మీ సహచరుడు నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్ట్ పై ట్వీట్ చెయ్యమన్న దేవినేని
రివర్స్ టెండరింగ్ పై మాజీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు నిప్పులు చెరిగారు. పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని గత తెలుగుదేశం ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసుందుకే రివర్స్ టెండరింగ్ అంటూ దేవినేని ఉమా మహేశ్వరరావు ఆరోపించారు. విజయసాయి రెడ్డిని ఉద్దేశించి ఇప్పుడు ట్వీట్ చేయవయ్యా... ఇంటర్ పోల్ నిందితులు మీరు, మీ సహచరుడిని అరెస్టు చేస్తే.. విడిపించడానికి ప్రధాని చుట్టూ తిరుగుతున్నారు అంటూ నిమ్మగడ్డ ప్రసాద్ ను మధ్యలోకి లాగిమరీ కామెంట్ చేశారు. దమ్ముంటే వీటి పై ట్వీట్ చెయ్యి అంటూ విజయసాయి రెడ్డిపై దేవినేని ఉమా ధ్వజమెత్తారు.
అవినీతి పరులు మీరా నీతి సూత్రాలు వల్లించేది అని మండిపడిన దేవినేని
అంతే కాదు పోలవరం ప్రాజెక్ట్ పై కావాలని అవినీతి ఆరోపణలు చేస్తున్నారని , అవినీతి పరులు మీరా నీతి సూత్రాలు వల్లించేది అని దేవినేని ప్రశ్నించారు . ఇక తాను విజయసాయిలా అక్రమాలకూ పాల్పడలేదని నువ్వా నన్ను బెదిరించేది అంటూ విమర్శించారు.సెర్బియాలో నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్ట్ పై ఎందుకు ట్వీట్ చేయలేదని దేవినేని ఉమా ప్రశ్నించారు. 22 మంది వైసీపీ ఎంపీలు ప్రధాని మోదీని కలిసి ఏం అడుక్కున్నారో చెప్పండని డిమాండ్ చేశారు. బెయిల్ పై తిరుగుతున్న విజయసాయి తమను బెదిరిస్తున్నారని మండిపడ్డారు. పోలవరం విషయంలో జగన్ అసత్యాలు ప్రచారం చేశారని.. పునాదులు లేపకపోతే.. స్పిల్ ఛానల్ దాటి నీరు ఎలా వచ్చిందని ప్రశ్నించారు దేవినేని . చంద్రబాబు పడిన కష్టానికి నిదర్శనం పోలవరం ప్రాజెక్టు అన్న దేవినేని పోలవరం ప్రాజెక్ట్ పనులను రెండు నెలల నుంచి నిలిపివేసిన పాపం మీదే అని మండిపడ్డారు . ఎర్రబస్సు ఎక్కి వచ్చామని, అక్కడ నుండి వచ్చిన వారం కాబట్టే ప్రజల కష్టసుఖాలు తెలుసనీ , విజయసాయిరెడ్డి లాగా అక్రమంగా వెనకెయ్యలేదని విమానాలు ఎక్కి రాలేదని ఎద్దేవా చేశారు.
బందర్ పోర్ట్ ను తెలంగాణాకు ఎంతకు అమ్మేశారని నిలదీసిన దేవినేని
ఇవాళ వైసీపీ నేత విజయసాయిరెడ్డి ట్వీట్లు కొడుతున్నాడు. అక్రమాస్తుల కేసులో ఆయన ఏ2 ముద్దాయి అని పేర్కొన్న దేవినేని నా ఖర్మ అయ్యా. నీతో నీతులు చెప్పించుకోవాల్సిన ఖర్మ పట్టింది నాకు అంటూఅసహనం వ్యక్తం చేశారు. ఇక గతంలోనూ పలుమార్లు విజయసాయి రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసిన దేవినేని పక్క వాళ్ళ అవినీతి బాగోతాల గురించి కాదు ముందు మీ కుంభకోణాల రామాయణాలు ట్వీట్ చెయ్యి నీకు దమ్ముంటే అంటూ సవాల్ చేశారు. ఇక బందరు పోర్టును తెలంగాణకు ఎంతకు అమ్మేశారంటూ వైసీపీ ప్రభుత్వాన్ని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా ప్రశ్నించారు. ప్రభుత్వం మారగానే బందరు పోర్టులో పని చేస్తున్న యంత్రాలన్నీ వెనక్కి వెళ్లిపోయాయని , ప్రభుత్వ బెదిరింపులకు భయపడి నిర్మాణ సంస్థ వెళ్లిపోయిందని చెప్పారు. క్విడ్ ప్రోకో సంస్థకు బందరు పోర్టును జగన్ ప్రభుత్వం ఇచ్చేసిందని దేవినేని ఆరోపించారు. బందరు పోర్టుపై సీఎం జగన్ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. పోర్టుకు సంబంధించిన రహస్య జీవోలను బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు .