ఈ దశాబ్దపు జోక్: టిఆర్ఎస్ ఉమా, గంగిరెడ్డితో జగన్కు సంబంధమని..
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై, టిఆర్ఎస్ నేతలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన బుధవారం మాట్లాడుతూ.. హైదరాబాద్ బ్రాండ్ను ఏపి సిఎం చంద్రబాబునాయుడు చెడగొడుతున్నారన్న టిఆర్ఎస్ నేతల మాటలు ఈ దశాబ్దపు జోక్గా అభివర్ణించారు.
రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఒప్పందాల గురించి తెలంగాణ సిఎం కెసిఆర్కు తెలియదా? అని దేవినేని ఉమా ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రుణమాఫీపై వైయస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
చంద్రబాబు నాయుడు త్వరలోనే రుణమాఫీపై ప్రకటన చేస్తారని ఉమామహేశ్వరరావు చెప్పారు. గంగిరెడ్డితో సంబంధం లేదని జగన్ ఒప్పుకోగలరా? అని ఆయన ప్రశ్నించారు.
ఉమ్మడి పరీక్షల కోసమే ప్రయత్నిస్తాం: గంటా
హైదరాబాద్: ఇంటర్ ఉమ్మడి పరీక్షల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని ఏపి విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. చిట్ట చివరి క్షణం వరకూ ఇంటర్ ఉమ్మడి పరీక్షల కోసమే ప్రయత్నిస్తామని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఎక్కడా సహకరించడం లేదని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ అమలుకు తాము సిద్ధమేనని ప్రకటించారు. పాత పద్ధతిలోనే డిఎస్సీ నిర్వహిస్తామని చెప్పారు.