ఏపీలో సాక్షి ప్రసారాలు బంద్: ఎందుకో చెప్పిన గంటా, 'తుని'పై సీఆర్ షాకింగ్
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు శుక్రవారం నాడు నిప్పులు చెరిగారు. జగన్ అభివృద్ధికి విరోధిగా మారారని దుయ్యబట్టారు.
ప్రజా సంక్షేమం పట్టించుకోకుండా కుట్రలు పన్నడమే పనిగా పెట్టుకున్నారన్నారు. తొలకరి వర్షాలు కురుస్తున్న వేళ రైతుల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంటే, ఇవేమీ పట్టని జగన్ ప్రజలను రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నాడన్నారు. రాయలసీమకు నీళ్లు రాకుండా జగన్ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
అందుకే సాక్షిని నిలిపేశాం: గంటా
సాక్షి టీవీ ఛానల్ ప్రసారాలను ఎందుకు నిలిపేశారో మంత్రి గంటా శ్రీనివాస రావు శుక్రవారం నాడు చెప్పారు. రెచ్చగొట్టే కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నందువల్లే ఈ చర్య తీసుకున్నట్లు తెలిపారు. ముద్రగడ ఉనికి కోసమే దీక్షలు చేస్తున్నారని, ఆయన దీక్ష వెనుక జగన్ ఉన్నారని ఆరోపించారు.
తని ఘటనకు పోలీసులే కారణం
తుని ఘటన పైన సిబిఐతో విచారించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సి రామచంద్రయ్య శుక్రవారం నాడు డిమాండ్ చేశారు. తుని ఘటనకు పోలీసులే కారణమని చెప్పారు. మఫ్టీ పోలీసులు రైలు నుంచి ప్రయాణీకులను దించాకే మంటలు అంటుకున్నాయని సమాచారం ఉందని బాంబు పేల్చారు.
కాగా, వైయస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు కూడా తుని ఘటన కుట్రగా అభిప్రాయపడ్డారు. అంబటి మాట్లాడుతూ... కాపు గర్జన వద్ద కావాలనే చంద్రబాబు పోలీసులను పెట్టలేదన్నారు. అందుకే తుని ఘటన జరిగిందన్నారు. నేరాలు జరగాల్సిన పరిస్థితిని చంద్రబాబు కల్పించారన్నారు. బీసీలో చేర్చమని చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని, అందుకే ముద్రగడ ఇప్పుడు అడుగుతున్నారని చెప్పారు.