నమ్మలేకపోతున్నా: నెహ్రూ మృతిపై బాబు, అవినాశ్ ఫ్రెండ్: లోకేష్
గుండెపోటుతో మృతిచెందిన టిడిపి నేత దేవినేని నెహ్రూ భౌతిక కాయాన్ని విజయవాడలోని గుణదలలో గల ఆయన నివాసంలో ఉంచారు. సీఎం చంద్రబాబు ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు.
విజయవాడ: గుండెపోటుతో మృతిచెందిన టిడిపి నేత దేవినేని నెహ్రూ భౌతిక కాయాన్ని విజయవాడలోని గుణదలలో గల ఆయన నివాసంలో ఉంచారు. సీఎం చంద్రబాబు ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు.
కుటుంబ సభ్యులను పరామర్శించారు. దేవినేని తనయుడు అవినాశ్తో మాట్లాడిన ముఖ్యమంత్రి ఆయనకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. నెహ్రూ ఓ వ్యవస్థలా పని చేశారని చెప్పారు.
పార్టీ అభ్యున్నతికి, రాష్ట్ర అభివృద్ధికి నెహ్రూ ఎప్పుడు పాటుపడ్డారన్నారు. నెహ్రూ చనిపోయారంటే నమ్మలేకపోతున్నానని చెప్పారు. ఇటీవల కాలంలో ఆయన పలుమార్లు తనను కలిశారు, పలు అంశాలపై తమ మధ్య చర్చ జరిగిందన్నారు.
విషాదం.. దేవినేని నెహ్రూ కన్నుమూత, బెజవాడ రాజకీయాల్లో చెరగని ముద్ర
పార్టీని బలోపేతం చేయాలని, రాష్ట్ర అభివృద్ధి జరగాలని కోరుకున్నారన్నారు. ఎన్టీఆర్ ఏ ఆశయం కోసం అయితే పార్టీ పెట్టారో తనవంతు కూడా పని చేస్తానని పదేపదే చెప్పారన్నారు. బెజవాడ రాజకీయాలతో ఆయనకు అవినాభావ సంబంధం ఉందన్నారు. ఎన్టీఆర్కు నెహ్రూ సన్నిహితంగా మెలిగారని చెప్పారు. కాగా, చంద్రబాబు పోలవరం నుంచి నేరుగా గుణదల వచ్చారు.
విద్యార్థి నాయకుడిగా.. లోకేష్
ఒక విద్యార్థి నాయకుడిగా, యూనియన్ లీడర్గా ఉన్నటువంటి వ్యక్తి., దివంగత ఎన్టీఆర్ పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చి, ప్రజలకు నిరంతరం సేవ చేసిన ఓ గొప్ప నాయకుడు దేవినేని నెహ్రూ అని మంత్రి నారా లోకేష్ కొనియాడారు. దేవినేని నెహ్రూ చనిపోయారంటూ ఉదయాన్నే తనకు ఫోన్ వచ్చిందని, తాను షాక్కు గురయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు.
రెండున్నర గంటలు పరిచయం చేశారు
ఇటీవలే ఆయన టీడీపీలో చేరిన సందర్బంగా ఆయనతో పాటు వచ్చిన కార్యకర్తలు, అభిమానులందరినీ పేరు పేరునా రెండున్నర గంటల పాటు తనకు పరిచయం చేశారని చెప్పారు.
సలహాలిచ్చేవారు
నిత్యం తనను డైరెక్ట్గా కలవకపోయినప్పటికీ, ఎప్పటికప్పుడు తనకు ఫోన్ చేస్తూ ఏం చేస్తే బాగుంటుందో అని అనేక సలహాలు ఇచ్చేవారన్నారు. ఒక్కసారి ఏదైనా అనుకుంటే, దాన్ని సాధించేంత వరకు నిరంతరం కష్టపడే వ్యక్తి నెహ్రూ అన్నారు. సిద్ధాంతాలు కలిగిన మంచి నేత అని కితాబిచ్చారు. ఇంత గొప్ప నేత, కార్యకర్తను కోల్పోవడం టీడీపీకి తీరని లోటు అన్నారు.
అవినాశ్ మిత్రుడయ్యాడు, అండగా ఉంటాం
ఆయన కుటుంబాన్ని, ఆయనను నమ్ముకున్న కార్యకర్తలను టీడీపీ ఆదుకుంటుందని లోకేష్ భరోసా ఇచ్చారు. నెహ్రూ కుమారుడు అవినాశ్ కూడా తనకు మంచి మిత్రుడయ్యాడని, అనేకసార్లు తామిద్దరం మాట్లాడుకున్నామని చెప్పారు. అవినాశ్కు అండగా టీడీపీ ఉంటుందన్నారు.