రాజధానిని అడ్డుకుంటారా, ప్రాణాలిస్తా, బాబును తప్పుపట్టా: జగన్ను ఏకేసి టిడిపిలోకి నెహ్రూ
విజయవాడ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ గురువారం సాయంత్రం తెలుగుదేశం పార్టీలో చేరారు. దేవినేనితో పాటు ఆయన తనయుడు దేవినేని అవినాశ్, మరో కాంగ్రెస్ నేత కడియాల బుచ్చిబాబు చేరారు. ఈ సందర్భంగా దేవినేని మాట్లాడారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ రాజధాని అమరావతిని అడ్డుకోవాలని చూస్తున్నారని, కానీ తాము రాజధానికి రక్షణ కవచంలా ఉంటామని దేవినేని నెహ్రూ అన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం చంద్రబాబుకే సాధ్యమన్నారు. అమరావతి సృష్టికర్త చంద్రబాబు అన్నారు. అమరావతి కోసం ప్రాణాలు అర్పిస్తానన్నారు. అమరావతికి చంద్రబాబు రక్షణ కవచంగా ఉన్నారన్నారు.
అమరావతి రైతులతో మాట్లాడిన తర్వాత తాను మళ్లీ ఆ ప్రాంతానికి వెళ్లలేదని చెప్పారు. వారు సంతోషంగా భూములు ఇచ్చారన్నారు. కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీకి రక్షణ కవచంలా ఉంటానని చెప్పారు. తాను 1983లో తెలుగుదేశం పార్టీలో చేరినప్పుడు, టిడిపి జెండా కప్పుకునే చనిపోతానని చెప్పానని గుర్తు చేశారు. అలాగే చేస్తానన్నారు.
పట్టిసీమను ఏడాదిలో పూర్తి చేస్తానని చంద్రబాబు చెప్పారని, తొలుత తాను కూడా పట్టిసీమను వ్యతిరేకించానని, కానీ దానిని ఏడాదిలో పూర్తి చేశారన్నారు. తాను చంద్రబాబు సంక్షేమ పథకాలను ఎప్పుడూ వ్యతిరేకించలేదన్నారు. చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నారన్నారు.
ఎన్టీఆర్ రాజకీయ భిక్ష పెట్టారు
విపక్షానికి ఏమాత్రం అవగాహన లేదన్నారు. జగన్కు అనుభవం లేదన్నారు. రాజధానిని అడ్డుకోవాలని చూడటం సరికాదన్నారు. నాడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పైన ప్రకటన చేయకముందే తాను కలిశానని గుర్తు చేశారు. ఎన్టీఆర్ తనకు రాజకీయ భిక్ష పెట్టారన్నారు. నాలుగుసార్లు తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచానని చెప్పారు.
చంద్రబాబుతో కలవాలని ఎప్పటి నుంచో అనుకున్నానని, కానీ ఏదో అవరోధం వచ్చిందన్నారు. ఇప్పుడు నా కోరిక నెరవేరిందన్నారు. పట్టిసీమ అంటే పోలవరం వెనక్కి పోతుందని మాత్రమే వ్యతిరేకించానని, కానీ ఏడాదిలో పూర్తి చేశారన్నారు. పట్టిసీమను ఏడాదిలో పూర్తి చేస్తే తాను తెలుగుదేశం పార్టీతో కలుస్తానని చెప్పానన్నారు. విజయవాడ రాజధాని ప్రాంతంగా మారుతోందన్నారు.
దేవినేనితో పాటు మీరు రండి: చంద్రబాబు
దేవినేని నెహ్రూ ఓ మాటకు కట్టుబడి ఉండే వ్యక్తి అని చంద్రబాబు అన్నారు. ఆయన మాట మీద నిలబడుతారన్నారు. నిజమైన, నిస్వార్థమైన, సమాజం కోసం సేవ చేయాలనుకునే నాయకులకు సరైన వేదిక తెలుగుదేశం పార్టీ అన్నారు. మంచివాళ్లు ఎక్కువ మంది వచ్చి తనతో కలిస్తే ఏపీ తొందరంగా మంచి జరుగుతుందన్నారు.
నేను రాత్రింబవళ్లు కష్టపడుతున్నానని చెప్పారు. దేశాలు తిరుగుతున్నానని, పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తున్నానని చెప్పారు నెహ్రూ రాకతో టిడిపి బలం పెరుగుతుందన్నారు. ఇంకా మంచివాళ్లు ఒకరు ఇద్దరు ఉంటే రావాలన్నారు. మరొక్కసారికి దేవినేనిని పార్టీలోకి స్వాగతిస్తున్నానని చెప్పారు.
యువతకు లోకేష్ అన్న: అవినాశ్
పెద్దలందరికీ చంద్రబాబు అన్న అయితే, యువతకు లోకేష్ అన్నతో సమానమని దేవినేని అవినాష్ అన్నారు. చంద్రబాబు ఉన్నారు కనుక తమ భవిష్యత్కు ఎటువంటి ఢోకా లేదన్నారు. మరో 30 ఏళ్లు కృష్ణాజిల్లా గడ్డపై టీడీపీ జెండా ఎగురుతుందన్నాపు, రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు ఎంతగానో కృషి చేస్తున్నారని, తాము కూడా సైనికుల్లా పనిచేస్తామన్నారు. ప్రజలు సుఖంగా ఉన్నారంటే, డానికి చంద్రబాబే కారణమని అవినాష్ అన్నారు.