దేవినేని మృతి: ఏడ్చిన హరికృష్ణ, హైదరాబాద్ రావొద్దని అవినాష్
తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ మృతి వార్త విని నందమూరి హరికృష్ణ కంటతడి పెట్టారు. నెహ్రూ సోమవారం ఉదయం ఐదున్నర గంటల ప్రాంతంలో హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ
హైదరాబాద్/విజయవాడ: తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ మృతి వార్త విని నందమూరి హరికృష్ణ కంటతడి పెట్టారు. నెహ్రూ సోమవారం ఉదయం ఐదున్నర గంటల ప్రాంతంలో హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన విషయం తెలిసిందే.
విషాదం.. దేవినేని నెహ్రూ కన్నుమూత, బెజవాడ రాజకీయాల్లో చెరగని ముద్ర
ఈ విషయం తెలియగానే నందమూరి హరికృష్ణ షాక్కు గురయ్యారు. అనంతరం ఆయన హుటాహుటిన నెహ్రూ భౌతికకాయం ఉన్న కేర్ ఆసుపత్రికి చేరుకున్నారు. ఆక్కడ ఆయన మృతదేహాన్ని చూసి కంటతడి పెట్టారు.
హరికృష్ణతోను సాన్నిహిత్యం
దేవినేని నెహ్రూకు ఎన్టీఆర్తో మంచి సాన్నిహిత్యం ఉంది. ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో ఆయన టిడిపిని వీడి, కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్టీఆర్తో సాన్నిహిత్యం ఉన్న సమయంలోనే హరికృష్ణతోను మంచి సంబంధాలు ఉన్నాయి.
అయిదుసార్లు ఎమ్మెల్యే
ఎన్టీఆర్ హయాం నుంచే తెలుగుదేశం పార్టీలో నెహ్రూ కీలకంగా వ్యవహరించారు. ఆ సమయంలో ఉన్నత విద్యా శాఖ మంత్రిగా పని చేశారు. తన రాజకీయ ప్రస్థానంలో పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. బెజవాడ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు.
పలువురి సంతాపం
దేవినేని నెహ్రూ మృతి పట్ల టిడిపి, కాంగ్రెస్ సీనియర్ నేతలు సంతాపం ప్రకటించారు. నెహ్రూ కుటుంబ సభ్యులకు నేతలు ప్రగాడ సానుభూతి తెలిపారు. నెహ్రూ మరణవార్త విన్న అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆయన అనుచరులు, వర్గీయులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హైదరాబాద్కు బయల్దేరారు.
కార్యకర్తలు రావొద్దని అవినాష్
అనుచరులు, కార్యకర్తలెవ్వరూ హైదరాబాద్ రావొద్దని నెహ్రూ తనయుడు అవినాష్ సూచించారు. అయితే, అప్పటికే పలువురు నేతలు, ప్రముఖులు కేర్ ఆస్పత్రికి చేరుకున్నారు. నెహ్రూ మృతదేహాన్ని సాయంత్రం విజయవాడకు తరలించి రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
చంద్రబాబు సంతాపం
దేవినేని నెహ్రూ మృతిపట్ల పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు సంతాపం ప్రకటించారు. నెహ్రూ ఆకస్మిక మృతి తనకు, పార్టీకి తీరని లోటని చంద్రబాబు అన్నారు.