'సీఎం పట్ల మర్యాద లేని జగన్': అడగకున్నా చెప్తున్నా: సాయిప్రతాప్
విజయవాడ: తెలుగుదేశం పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఉన్నప్పటికీ వైసిపి అధినేత జగన్ అవిశ్వాసం పేరుతో సభా సమయాన్ని వృథా చేశారని తెలుగుదేశం పార్టీ నేత ప్రభాకర్ చౌదరి గురువారం నాడు మండిపడ్డారు. భద్రత కోసమని అనంతపురం జిల్లాలో 600 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
సీఎం పట్ల మర్యాద లేకుండా: దేవినేని
వైసిపి అధినేత జగన్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్ల మర్యాద లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. ప్రాజెక్టులకు అడ్డుపడుతున్న జగన్ను ప్రజలు బంగాళాఖాతంలో పడేస్తారని కౌంటర్ ఇచ్చారు.
నిన్న జగన్ నెల్లూరులో మాట్లాడూ.. ఈ ప్రభుత్వాన్ని ప్రజలు బంగాళాఖాతంలో పడేస్తారని వ్యాఖ్యానించారు. దీనికి దేవినేని ఉమ పైవిధంగా కౌంటర్ ఇచ్చారు. దేవినేని ఇంకా మాట్లాడుతూ... 2018 నాటికి పోలవరం నీరు పారించి జగన్ నోరు మూయిస్తామన్నారు.
గత పాలకులు జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞానికి పాల్పడ్డారని, తాము మాత్రం కాలువల్లో తాము నీరు పారిస్తామన్నారు. వంశధార,నాగావళి నుంచి విశాఖకు తాగునీరందిస్తామని, పంటలను కాపాడతామన్నారు. తాగునీటికి ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారన్నారు.
అసెంబ్లీలో జగన్ మాట్లాడే తీరు ఏమాత్రం సవ్యంగా లేదన్నారు. ఏపీలోని ఎండల విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. గత రెండు రోజులుగా ఎండ తీవ్రత పెరిగిందని, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
సంకుచిత స్వభావం కలవి: రఘువీరా
ఏపీలోని అధికార టిడిపి, ప్రతిపక్ష వైసిపిలు సంకుచిత స్వభావం కలవని ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ రఘువీరా రెడ్డి అన్నారు. ఏపీ అసెంబ్లీలో అనవసర విషయాల పైనే చర్చ జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రాణాలతో ఆటలొద్దు: కామినేని
ఈ నెల 23వ తేదీన నోటీసులు ఇచ్చి 25వ తేదీ నుంచి వైద్య సేవలు ఆపివేస్తామని అంటే ఊరుకునేది లేదని, ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటుందని, ప్రత్యామ్నాయాలు ఉన్నాయని మంత్రి కామినేని శ్రీనివాస రావు గురువారం మండిపడ్డారు.
ఆసుపత్రుల సమస్యలు తమకు తెలుసునని, నిధులను విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. బెదిరింపు ధోరణి మాత్రం సరికాదని స్పెషాలిటీ ఆసుపత్రుల యాజమాన్యాలపై మండిపడ్డారు. ఎన్టీఆర్ ఆరోగ్య సేవలను రేపటి నుంచి నిలిపివేస్తామని నోటీసులు ఇవ్వడంపై ఆయన ఘాటుగా స్పందించారు. ఆసుపత్రుల నిర్ణయం తనకు బాధను కలిగించిందని, పేద ప్రజల ప్రాణాలతో ఆడుకోవద్దన్నారు.
అడగక ముందే చెబుతున్నా: సాయి ప్రతాప్
రాష్ట్రాభివృద్ధికి, ముఖ్యంగా రాయలసీమ అభివృద్ధికి అనునిత్యం పాటుపడుతున్న చంద్రబాబుకు అండదండగా నిలవాలన్న ఉద్దేశంతోనే తాను టిడిపిలో చేరినట్లు సాయి ప్రతాప్ చెప్పారు. నియోజకవర్గంలో అందరమూ చర్చించుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.
ఈనాడు చాలామందికి ఒక రకమైన ఆలోచన వచ్చి ఉండవచ్చునని, నేను కాంగ్రెస్ పార్టీని వదిలి టిడిపిలో చేరడంపై మీరు ప్రశ్న అడగకముందే నేను సమాధానం ఇస్తున్నానని చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ చేయి కలపాలన్నారు.
ముఖ్యమంత్రితో కలిసి పని చేసి ముందుకు వెళ్లాలన్న ఆకాంక్ష అన్నారు. రెండవది రాష్ట్రంలోని ప్రాంతాలన్నీ బాగుండాలన్న ఉద్దేశ్యం అన్నారు. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకుని కళా వెంకట్రావు ఆహ్వానంతో వచ్చానని, పెద్దల ఆశీర్వాదంతో ముందుకు వెళ్తానని చెప్పారు.