అన్న ‘గాలి’ కోసం తమ్ముడు జగన్ వెన్నుపోటు: రాయపాటి
విజయవాడ: బీజేపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలపై ఏపీ మంత్రి ఉమామహేశ్వరరావు, నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎంపీ రాయపాటి మాట్లాడుతూ.. నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకుంటూ బీజేపీ, వైసీపీ నాయకులు సైంధవుల్లా వ్యవరించారని మండిపడ్డారు.
Recommended Video
విభజన హామీల అమలుపై బీజేపీ నాయకులు ప్రజాక్షేత్రంలో మాట్లాడాలని సవాల్ విసిరారు. అధికారం కోసం అడ్డదారులు తొక్కుతూ 5కోట్ల మంది ఆంధ్రులను నిలువునా వంచిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అన్న గాలి కోసం తమ్ముడు జగన్..
అన్న గాలి జనార్ధన్ రెడ్డి కోసం సొంత జిల్లాకు వెన్నుపోటు పొడిచిన తమ్ముడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అని దుయ్యబట్టారు. కర్ణాటక ఎన్నికల్లో అందించిన ఆర్థిక సహకారానికి కడప స్టీల్ ప్లాంట్ను గాలి జనార్ధన్ రెడ్డికి బహుమానంగా ఇచ్చేందుకు యత్నిస్తూ కేంద్రం మరో క్విడ్ ప్రోకోకు తెరతీసిందని రాయపాటి ఆరోపించారు.
జమ్మలమడుగులో బ్రహ్మణి స్టీల్స్ నిర్మించడానికి తనకు అనుమతి ఇవ్వాలంటూ గాలి జనార్ధన్ రెడ్డి బహిరంగంగా కోరడమే ఇందుకు నిదర్శనమని అన్నారు.
మోడీ వద్ద అతి తెలివితేటలు చూపండి
ఇక ఏపీ మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ.. బీజేపీ నేతలు తమ అతి తెలివితేటల్ని ప్రధాని నరేంద్ర మోడీ వద్ద చూపించుకోవాలని ఘాటుగా విమర్శించారు. ప్రాజెక్టుల నిధులు, విభజన హామీలను గురించి చేతనైతే ఢిల్లీలో మాట్లాడాలని.. గల్లీలో కాదని వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టు సందర్శించి లేనిపోని అవాకులు చెవాకులు మాట్లాడిన బీజేపీ నేతలు వాస్తవాలు తెలుసుకోవాలని హితవు పలికారు.
అప్పులు తెచ్చి వడ్డీలు కడుతూ..
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటివరకూ 55.73 శాతం పనులు పూర్తయ్యాయని మంత్రి దేవినేని స్పష్టం చేశారు. కేంద్రం నిధులు సకాలంలో ఇవ్వకపోయినా.. ప్రాజెక్టు నిర్మాణం ఆగకూడదన్న లక్ష్యంతో అప్పులు తెచ్చి మరీ నిర్మిస్తున్నామని చెప్పారు. దీనికోసం ప్రభుత్వం 400 కోట్ల రూపాయల వడ్డీలను కడుతోందని తెలిపారు. ప్రతిపక్షాలు దండగ అని విమర్శించిన అన్ని ప్రాజెక్టులకూ జాతీయ స్థాయిలో అవార్డులు వచ్చాయన్నారు.
మార్నింగ్, ఈవినింగ్ వాక్ చేస్తున్న జగన్
రాష్ట్ర ప్రగతిని చూడలేక, తట్టుకోలేక ప్రతిపక్ష నేత జగన్ మార్నింగ్ వాక్, ఈవెనింగ్ వాక్లు చేస్తున్నారని దేవినేని ఎద్దేవా చేశారు. టీడీపీ ప్రభుత్వాన్ని తిడుతున్న బీజేపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ, పురందేశ్వరి, జీవీఎల్ నరసింహారావు ఇతర రాష్ట్రాల్లోని జాతీయ ప్రాజెక్టులను పరిశీలించాలని సూచించారు. ప్రాజెక్టుకు సంబంధించిన రెండో డీపీఆర్ను ఆమోదింప చేసుకునేందుకు జలవనరుల శాఖ అధికారులు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని అన్నారు.