'4ఏళ్ల రంకు రాజకీయం బయటపడింది, ఆంధ్రోళ్లను కేసీఆర్ ఎన్ని మాటలన్నారు'
అమరావతి/హైదరాబాద్: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిల భేటీ పైన ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు బుధవారం తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. విభజన సమయంలో ఏపీకి అన్యాయం జరిగిందన్నారు. ఏపీకి చెందిన ఆస్తుల పంపకాల్లో కేసీఆర్ అడ్డుపడుతున్నారన్నారు.
అలాంటి వారితో జగన్ కలడవం విడ్డూరమన్నారు. జగన్ తెరాసతో చేతులు కలిపి ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని చెప్పారు. ఏపీ భవన్, ఢిల్లీ, హైదారాబుదోలని ఆస్తులపై తెరాస అడ్డుపడుతోందని ధ్వజమెత్తారు. హైదరాబాద్లో సీమాంధ్రులు ఎప్పటికైనా కిరాయిదారులేనని కేసీఆర్ గతంలో అన్నారన్నారు.
ఆంధ్రావాళ్ల గురించి కేసీఆర్ ఎన్ని మాటలన్నారు
ఆంధ్రావాళ్లు పన్ను ఎగ్గొడతారని, దొంగలు అని కేసీఆర్ చెప్పారని దేవినేని నిప్పులు చెరిగారు. లంకలో పుట్టిన వాళ్లు అందరూ రాక్షసులేనని, అలాగే ఆంధ్రావాళ్లు కూడా అంతే అన్నారని చెప్పారు. తెలుగుతల్లి తమ తల్లే కాదని, తెలుగు తల్లి తమ పాలిట దెయ్యమని విమర్శించారని ఆవేదన వ్యక్తం చేశారు. రికార్డింగ్ డ్యాన్స్ సంస్కృతి ఆంధ్రా వాళ్లదని కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారని చెప్పారు.
ఆంధ్రా ప్రముఖులనూ అవమానించారు
ఆంధ్రా కుక్కల్లారా 24 గంటల్లో వెళ్లిపోండి.. లేదంటే తన్ని వెళ్లగొడతా.. అని కేసీఆర్ కామెంట్ చేశారని దేవినేని అన్నారు. తాము ఎద్దులు, ఆవులకు పెట్టే ఉలవచారును ఆంధ్రా వాళ్లు తింటారని కేసీఆర్ అన్నారని గుర్తు చేశారు. నన్నయ్య ఆది కవి అంట.. అసలు అతను కవి కాదంటూ కేసీఆర్ అవమానించారన్నారు. ఇలాంటి వ్యక్తితో చేతులు కలపడానికి జగన్కు సిగ్గుండాలన్నారు. హైదరాబాద్లో సీమాంధ్రులు ఎప్పటికైనా కిరాయిదారులే అని చెప్పారన్నారు. జగన్మోహన్ రెడ్డి.. ఇది నీకు వినిపిస్తుందా? అని ప్రశ్నించారు. ఆంధ్రా బాపనోళ్లకు మంత్రాలు కూడా తెలియవన్న కేసీఆర్ ఇప్పుడు అక్కడకు వచ్చి సాష్టాంగ ప్రణామాలు చేస్తున్నారన్నారు. నాలుగు అడుగులు కాదు.. నాలుగువేల అడుగులు ముందుకు వేసినా జగన్కు ప్రజలు గుణపాఠం చెప్పితీరుతారన్నారు. ఈరోజు ఏపీ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి జగన్ దుర్మార్గమైన రాజకీయాలు చేస్తున్నారన్నారు.
అప్పుడే వైసీపీకి ముగింపు పలికారు
ఏపీ స్థానికత ఉన్న 1,200 మంది విద్యుత్ ఉద్యోగులను తెలంగాణ విద్యుత్ సంస్థలు రోడ్డు పైకి పంపేస్తే జగన్ ఏం చేశారని దేవినేని ప్రశ్నించారు. జగన్ పండుగ రోజున కుట్రలు, కుతంత్రాలకు తెరలేపాడన్నారు. అధికారం కోసం కక్కుర్తి పడి, సీఎం పదవి పిచ్చితో కేసీఆర్తో జగన్ చేతులు కలిపారన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ముగిసిన పాదయాత్రలోనే వైసీపీకి ఏపీ ప్రజలు ముగింపు పలికారన్నారు. అందుకే చివరి అస్త్రంగా ఏపీ ప్రజల ఆత్మగౌరవం తాకట్టు పెట్టడానికి జగన్ పూనుకున్నారన్నారు.
ఏపీ పోలీసులు వద్దు, తెలంగాణ పోలీసులు ముద్దా?
ఇక జగన్కు, వైసీపీకి ఆంధ్రా పోలీసులు పనికిరారని, న్యాయం చేయలని ఆరోపణలు చేస్తున్నారని దేవినేని అన్నారు. జగన్కు ఆంధ్ర పోలీసులు వద్దని, తెలంగాణ పోలీసులు ముద్దు కావడం విడ్డూరమన్నారు. తెరాస ఎంపీ కల్వకుంట్ల కవిత సహా టీఆర్ఎస్ నాయకులు పోలవరం ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు సుప్రీం కోర్టులో కేసులు వేశారన్నారు. సుప్రీం కోర్టుతో పాటు ఎన్జీటీలో కేసులు పెండింగులో ఉన్నాయన్నారు.
జగన్ను రిమోట్ కంట్రోల్గా వాడుకొని ఏపీపై పెత్తనం
ఒడిశాతో చేతులు కలిపి తెరాస చేయని కుట్రలు లేవని దేవినేని ఆరోపించారు. ఏపీకి తెలంగాణ రూ.5వేల కోట్లకు పైగా విద్యుత్ బకాయిలు చెల్లించాలన్నారు. అడిగితే దిక్కున్నచోట చెప్పుకోమంటున్నారని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు 62 శాతం పూర్తయితే పునాదులు కూడా కాలేదని విమర్శలు చేయడం ఏమిటన్నారు. ఏడు ముంపు మండలాలు ఏపీలో కలిపితేనే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తానని చంద్రబాబు ప్రధాని మోడీతో చెప్పారన్నారు. జగన్ను కేసీఆర్ రిమోట్ కంట్రోల్గా వాడుకుని ఏపీపై పెత్తనం చేయాలని చూస్తున్నారన్నారు. ఖబడ్దార్ ఆంధ్రా ద్రోహుల్లారా ఖబడ్దార్ అని హెచ్చరించారు.
నాలుగేళ్ల రంకు రాజకీయం బయటపడింది
రాష్ట్ర విభజన తర్వాత చెట్ల కింద తాము పరిపాలన చేశామని దేవినేని చెప్పారు. ప్రజల రాజధాని అమరావతి జగన్కు మాత్రం భ్రమరావతిగా మారిందన్నారు. రాజధాని శంకుస్థాపనకు రమ్మంటే జగన్ ఆహ్వాన పత్రికను కూడా తీసుకోలేదన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏడు మండలాలను చంద్రబాబు లాక్కున్నాడని కేసీఆర్ తిట్టారనీ, అలాంటి వ్యక్తితో కలిసి జగన్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారన్నారు. 2014లో తెలంగాణలో వైసీపీ నుంచి గెలిచిన తమ ఎమ్మెల్యేలను, ఎంపీలను జగన్ టీఆర్ఎస్లోకి పంపారని ఆరోపించారు. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెల్లజెండా ఎత్తి టీఆర్ఎస్కు సహకరించారన్నారు. ఈరోజు నిస్సిగ్గుగా పండుగ రోజున బహిరంగంగా ప్రజల ముందుకు వచ్చారని, రాజకీయాల్లో రంకులు, బొంకులు దాగవనీ, గత నాలుగేళ్లుగా జరుగుతున్న ఈ రంకు, బొంకు రాజకీయాలు ఇప్పుడు బయటపడ్డాయన్నారు.
అలాంటి వ్యక్తితో జగన్ చేతులు కలుపుతున్నారు
ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టడానికి జగన్ ఫెడరల్ ఫ్రంట్ బాగోతానికి తెరలేపారని దేవినేని ఆరోపించారు. కేసీఆర్ ప్రారంభిస్తామని చెబుతున్న కూటమి ఫెడరల్ ఫ్రంట్ కాదనీ, అది మోడీ ఫ్రంట్ అన్నారు. చంద్రబాబు మీద కక్షతో, టీడీపీని దెబ్బతీయాలనే ఆలోచనలతో ముగ్గురు మోడీలు (మోడీ, కేసీఆర్, జగన్) జగన్నాటకం ఆడుతున్నారన్నారు. తెలంగాణలో కలవని జాతి ఒకటే ఒకటి అది ఆంధ్రోళ్ల జాతి అని కేసీఆర్ దుషించారన్నారు. అలాంటి వ్యక్తులతో జగన్ చేతులు కలుపుతున్నారన్నారు.