'వైసీపీకి 30 సీట్లు రావని జగన్కు ప్రశాంత్ కిషోర్ షాక్! రిపోర్ట్ చూసి టీవీ పగులగొట్టాడు'
కర్నూలు/విశాఖపట్నం: కాంగ్రెస్ పార్టీతో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు ఉండదని తెలుగుదేశం పార్టీ నేత, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి గురువారం తేల్చి చెప్పారు. తమకు బీజేపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా శత్రువే అని చెప్పారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాకే నదుల అనుసంధానం ప్రారంభమైందని తెలిపారు.
అది గుర్తుంచుకోవాలిగా.. షాకిస్తున్నారు: కన్ఫ్యూజన్గా పురంధేశ్వరి వ్యాఖ్యలు!
వైసీపీకి 30 సీట్లు రావని జగన్కు ప్రశాంత్ కిషోర్ షాక్!
ఇరిగేషన్ పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం అవగాహన లేదని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు నిప్పులు చెరిగారు. జగన్ కుట్రలు, కుతంత్రాలు సాగవని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కనీసం 30 సీట్లు కూడా రావని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆ పార్టీ అధినేత జగన్కు రిపోర్ట్ ఇచ్చి షాకిచ్చారని అభిప్రాయపడ్డారు. దీంతో అభద్రతా భావంతో జగన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని చెప్పారు. పీకే రిపోర్ట్ చూసి జగన్ టీవీ పగులగొట్టారని, జగన్కు సీఎం పదవి పిచ్చి పట్టుకుందన్నారు. స్కూల్ ఎగ్గొట్టిన పిల్లాడిలా జగన్ రోడ్లపై తిరుగుతున్నారన్నారు.
రాయలసీమలో బంగారం పండించే పరిస్థితి తెస్తాం
కర్నూలు జిల్లాలో 47 శాతం వర్షపాతం తక్కువగా ఉందని దేవినేని చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఎత్తిపోతల పథకాలు ఉపయోగపడతాయన్నారు. ఈ సీజన్లో శ్రీశైలానికి 370 టీఎంసీల నీరు వచ్చిందని తెలిపారు. కర్నూలు జిల్లాలో హంద్రీనీవా నీటితో చెరువులు నింపుతామని తెలిపారు. రాయలసీమలో బంగారం పండించే పరిస్థితిని తీసుకు వస్తామని చెప్పారు.
చంద్రబాబు ఏ తప్పు చేయకుంటే
చంద్రబాబు నాయుడు ఏ తప్పు చేయకుంటే ఎందుకు భయపడుతున్నారని బీజేపీ శాసన సభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు ప్రశ్నించారు. బీజేపీ నేతలు విష్ణు, జీవీఎల్, సోము వీర్రాజు తదితరులు గవర్నర్ను కలిశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. పీడీ అకౌంట్లపై సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. ఏ తప్పు చేయకపోతే సీబీఐ విచారణకు చంద్రబాబు సిద్ధపడాలన్నారు.
అప్పులు తెచ్చి దోచుకోవాలని
పీడీ అకౌంట్లపై సీబీఐ విచారణ జరిపించాలని గవర్నర్ను కోరామని జీవీఎల్ నర్సింహా రావు చెప్పారు. పీడీ అకౌంట్లపై ఇప్పటికే నివేదిక తెప్పించుకున్నానని గవర్నర్ చెప్పారని, అదనంగా సమాచారం ఉంటే ఇవ్వాలని ఆయన కోరారని తెలిపారు. ఏ రాష్ట్రంలోను లేని విధంగా ఏపీలో పీడీ అకౌంట్లను తెరిచారని, మొత్తం రూ.53 వేల కోట్ల నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. పీడీ అకౌంట్లపై యనమల రామకృష్ణుడు సహా అందరూ అబద్ధాలు చెబుతున్నారని, పీడీ అకౌంట్లలో జరిగిన అవినీతిని కాగ్ తప్పు పట్టిందన్నారు. అవినీతి కోసమే అమరావతి బాండ్ల పేరుతో అప్పులు తెచ్చారన్నారు. అప్పులు తెచ్చి దోచుకోవాలని చూస్తున్నారన్నారు.
టెండర్లలో ప్రభుత్వ సంస్థలు లేకుంటా ఆంక్షలు
భోగాపురం ఎయిర్ పోర్ట్ టెండర్లను రద్దు చేసి టీడీపీ ప్రభుత్వం కొత్త కుంభకోణానికి తెరలేపిందని సోము వీర్రాజు ఆరోపించారు. భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణానికి ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ముందుకొచ్చిందన్నారు. కానీ టెండర్లలో ప్రభుత్వ రంగ సంస్థలు పాల్గొనరాదని ఆంక్షలు పెడుతున్నారన్నారు. కేవలం ముడుపుల కోసమే దీనిని ప్రయివేటు రంగ సంస్థలకు కట్టబెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. దీనిపై తాము కోర్టుకు వెళ్తామన్నారు.
పసలేని ఆరోపణలు
ఎవరు అడ్డుపడినా అమరావతి నిర్మాణం ఆగదని టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. అమరావతి బాండ్లపై బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మిస్తామని హామీ ఇచ్చిన మోడీ దానిని విస్మరించారన్నారు. కేంద్రం సహకరించకపోయినా రాజధాని నిర్మాణం ఆగదన్నారు. సాధ్యమైనంత వేగంగా తాము నిర్మిస్తామన్నారు. అందుకే అమరావతి బాండ్లు అన్నారు. ఇందులో ఎలాంటి రాజకీయం లేదన్నారు. విభజన హామీల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురాలేకపోయిన ఏపీ బీజేపీ నేతలు పసలేని ఆరోపణలు చేస్తున్నారన్నారు.