తెలంగాణది తొండివాదన: హరీష్ రావుకు దేవినేని ఉమ కౌంటర్
న్యూఢిల్లీ: సాగు నీటి ప్రాజెక్టులపై తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు చేసిన వాదనకు ఆంధ్రప్రదేశ్ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు కౌంటర్ ఇచ్చారు. తెలిసీతెలియకుండా తెలంగాణ ప్రభుత్వం తొండివాదన చేస్తోందని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర విభజన తాము కోరుకులేదని, విభజన కోరుకున్నవారు రాసిన చట్టాలివని వ్యాఖ్యానించారు.
మీరు రాసిన చట్టాలను అమలుచేయాలని కోరుతున్నామని ఆయన అన్నారు. ప్రాజెక్టుల వారీగా బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులు చేసిందని, ట్రిబ్యునల్ కేటాయింపుల మేరకే కేఆర్ఎంబీ పంపిణీ చేయాలని కోరారు. సాగర్ ప్రాజెక్టునే బోర్డు పరిధిలోకి తేవాలని కోరుతున్నామని తెలంగాణ ప్రభుత్వం అసత్య ఆరోపణలు చేస్తోందని ఆయన అన్నారు.
అన్ని ప్రాజెక్టులను కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకురావాలని తెలంగాణ రైతులూ బాగుండాలని టీడీపీ ప్రభుత్వం కోరుకుంటోందని ఆయన చెప్పారు. రాష్ట్రాలు విడిపోయినా తెలుగు వారంతా ఒక్కటేనని దేవినేని ఉమ వ్యాఖ్యానించారు. తెలంగాణ నీటి వాటాను తాము అడగడం లేదని ఆయన చెప్పారు
తెలంగాణ వాటాలో ఒక్క చుక్క నీటిని కూడా కోరుకోవడం లేదని ఆయన చెప్పారు. కేంద్రం అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటుచేయాలని కోరారు. తమ కన్ను పొడిచే ఉద్దేశ్యంతో నల్గొండ, ఖమ్మం రైతుల కన్ను పొడవొద్దని ఆయన తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు. నిరుడు తెలంగాణ ప్రభుత్వం సరిగ్గా నీటి విడుదల చేయలేదని ఆరోపించారు. దాంతో డెల్టాలో తీవ్ర ఇబ్బందులు వచ్చాయని చెప్పారు.
ఇష్టానుసారం నీరు విడుదల చేస్తే తాగునీటి అవసరాలు ఎలా తీరుతాయని దేవినేని ఉమ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. డ్రాఫ్ట్ నోటిఫికేషన్పై ఏమైనా ఇబ్బందులు ఉంటే కేంద్రానికి చెప్పుకోవాలని సూచించారు. బ్రిజేష్ ట్రిబ్యునల్ గెజిట్ చేసే వరకూ బచావత్ ట్రిబ్యునల్ అమలులో ఉంటుందని చెప్పారు. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అమలు చేయాలని కేంద్రాన్ని కోరామని తెలిపారు.
బాబ్లీని అడ్డుకోవడానికి వెళ్లి లాఠీ దెబ్బలు తిన్నామని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబుతో మహారాష్ట్ర పోలీసులు అమర్యాదగా ప్రవర్తించారని, అలాంటి మహారాష్ట్ర ఇప్పుడు మీకు చుట్టమైందని, ఆల్మట్టి ఎత్తు పెంచిన కర్ణాటక మీకు ప్రీతిపాత్రమైందా..దిగువన ఉన్న మేం అన్యాయం చేస్తున్నామా అని దేవినేని ఉమ తెలంగాణ ప్రభుత్వాన్ని అడిగారు.