కెసిఆర్ కనుసన్నల్లోనే, ఇప్పుడేమో: దేవినేని ఉమా
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా మార్చే పోలవరం ప్రాజెక్టును అడ్డుకోవద్దని ఏపి మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం ఆర్డినెన్స్ బిల్లును వ్యతిరేకించడం అర్థరహితమన్నారు. కెసిఆర్ అధికారం కోసం అన్నింటికీ ఒప్పుకున్నారనీ.. ఇప్పుడు అధికారంలోకి రావడంతో మాటమారుస్తున్నారని ఆరోపించారు.
లక్షలాదిమంది ప్రజలకు మేలు చేసే పోలవరం ప్రాజెక్టును అడ్డుకోవద్దని కెసిఆర్ను ఉమా మహేశ్వరరావు కోరారు. పోలవరం బహుళార్థక ప్రాజెక్టును మూడు సంవత్సరాల్లో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ప్రాజెక్టుతో ఉత్తారాంధ్రకు సాగు, తాగు నీరందుతుందని అన్నారు. పరిశ్రమలకు కూడా ఉపయోగం ఉందని అన్నారు.
పోలవరం ప్రాజెక్టుపై రాజకీయాలు తగవని కెసిఆర్కు ఉమామహేశ్వరరావు సూచించారు. స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను రెచ్చగొట్టొద్దని అన్నారు. రాష్ట్ర విభజన కెసిఆర్ కనుసన్నల్లోనే జరిగిందని.. పోలవరం ఆర్డినెన్స్ గురించి కెసిఆర్కు స్పష్టంగా తెలుసని అన్నారు. రాజకీయాల కోసం అమాయకులను బలి చేయొద్దని అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించడం ద్వారా గిరిజనుల హక్కులను కాపాడేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయనే విషయం తెలుస్తోందని తెలిపారు.
కేంద్ర హోమంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా గిరిజన హక్కులను కాపాడుతామని ప్రకటించారని ఉమా చెప్పారు. హైదరాబాద్లో రూ. 16 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టినా.. తాము వదులుకున్నామని, ఉమ్మడి రాజధానికీ ఒప్పుకున్నామని చెప్పారు. విభజన బిల్లులోనే పోలవరం ముంపు గ్రామాలను ఏపికి ఇస్తామని పేర్కొన్నట్లు ఆయన తెలిపారు. ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానితో మాట్లాడి ఆర్డినెన్స్ను చట్టరూపంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేశారని తెలిపారు.