పరిష్కారం: హరీష్, ఉమ నవ్వుతూ కలిసి వచ్చి, చెప్పారు
హైదరాబాద్: నాగార్జునసాగర్ వద్ద కృష్ణా జలాల వివాదం ఇరు రాష్ట్రాల మధ్య పరిష్కారమైంది. గవర్నర్ నరసింహన్ సమక్షంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె. చంద్రశేఖర రావు, నారా చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం జరిపిన చర్చలు ఫలితాన్నిచ్చాయి. ముఖ్యమంత్రులు ఇరువురు వెళ్లిపోయిన తర్వాత ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖ మంత్రులు దేవినేని ఉమా మహేశ్వర రావు, టి. హరీష్ రావు కలిసి నవ్వుకుంటూ రాజభవన్ బయటకు వచ్చారు. కలిసి మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఇరు రాష్ట్రాల రైతాంగ ప్రయోజనం దృష్ట్యా అందుబాటులో ఉన్న నీటని పంటలను కాపాడడానికి ఉపయోగించాలని నిర్ణయం తీసుకున్నట్లు వారు చెప్పారు.
నాగార్జునసాగర్ ఆనకట్టపైకి పోలీసులు, రాజకీయ పార్టీల కార్యకర్తలు వెళ్లకూడనది నిర్ణయం తీసుకున్నట్లు హరీష్ రావు చెప్పారు. ఇరు రాష్ట్రాల ఇంజనీర్లు మాత్రమే ఆనకట్టపైకి వెళ్లి తగిన విధంగా చర్యలు తీుకుంటారని ఆయన గవర్నర్తో ఇరు రాష్ట్రాల భేటీ తర్వాత శనివారంనాడు మీడియాతో చెప్పారు. కుడి, ఎడమ గట్టు కాలువల కింద, కృష్ణా డెల్టాకు, ఎఎంఆర్సీలో ఉన్న ఇరు రాష్ట్రాల్లోని ప్రస్తుత పంటలను కాపాడడానికి, అవి ఎండిపోకుండా చూడడానికి జాగ్రత్తగా అందుబాటులో ఉన్న నీటిని వాడాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు.
ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు మాట్లాడుకుని తగిన విధంగా చర్యలు తీసుకుంటారని ఆయన చెప్పారు. వచ్చే ఖరీఫ్ కాలం నుంచి కేంద్ర అధికారుల సహకారం తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. పంటలు ఎండిపోకుండా చూడడానికి తక్షణమే నీటిని విడుదల చేయాలి కాబట్టి తాగునీటి అవసరాలకు తగ్గించి అయినా సరే నీటిని విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు.
సమస్య పరిష్కారమైందని దేవినేని ఉమా మహేశ్వర రావు చెప్పారు. ఇరు రాష్ట్రాల ఇంజనీర్ ఇన్ చీఫ్లు మాట్లాడుకుని నీటి విడుదలకు చర్యలు తీసుకుంటారని ఆయన చెప్పారు. భవిష్యత్తులో నాగార్జున సాగర్ ఆనకట్ట వద్ద అవాంఛనీయమైన సంఘటనలు జరగుకుండా చూడాలని కూడా నిర్ణయించుకున్నట్లు, అందుకు సమన్వయమూ సంయమనంతో వ్యవహరించనున్నట్లు ఆయన తెలిపారు. ఎప్పటికప్పుడు అవసరమైతే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడుకుంటారని, ఎప్పటికప్పుడు హరీష్ రావు తానూ మాట్లాడుకుంటామని, ఇరు రాష్ట్రాల అధికారులు మాట్లాడుకుంటారని, అలా చర్చలు జరుపుకుని చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.