బాబు తెలంగాణలో పర్యటించారనే ఉక్రోశం: హరీష్పై దేవినేని ఉమ
విజయవాడ: తమ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, తమ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణలో పర్యటించారనే ఉక్రోశంతోనే నాగార్జున సాగర్ కుడి గట్టు కాలువకు తెలంగాణ ప్రభుత్వం నీటిని ఆపేసిందని ఆంద్రప్రదేశ్ నీటి పారదుల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు అన్నారు. కృష్ణా నది జలాల వాడకంపై తెలంగాణ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగావ్యతిరేకించారు.
ఎపి అవసరాలకు మించి నీటిని వాడుకోలేదని ఆయన స్పష్టం చేశారు. అనవసరంగా నాగార్జునసాగర్ నీటి వాడకాన్ని తెలంగాణ ప్రభుత్వం వివాదం చేస్తోందని ఆయన విమర్సించారు. బచావత్ నిబంధనల ప్రకారమే తాము నీటిని వాడుకుంటున్నామని ఆయన చెప్పారు. తెలంగాణలోని ఖమ్మం, నల్లగొండ జిల్లాలకో అదనంగా 145 వేల క్యూసెక్కుల నీటిని వాడుకున్నారని ఆయన చెప్పారు. తెలంగాణ దీన్ని ప్రస్తావించడం లేదని ఆయన అన్నారు. ఎపి భూభాగంలోకి తెలంగాణ పోలీసులు వచ్చి దాడి చేసే ప్రయత్న చట్టబద్దమా అని ఆయన అడిగారు.
తమ నుంచి లేఖ కావాలని హరీష్ రావు అడుగుతున్నారని, నిజానికి తమ రాష్ట్ర అధికారులు ఏ రోజుకా రోజు తెలంగాణ అధికారులకు సమాచారం అందిస్తున్నారని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఏ పంతాలకు, పట్టించుపులకు వెళ్తోందని ఆయన అడిగారు. తమ రాష్ట్రానికి 380.93 టిఎంసిల నీటి హక్కు ఉందని, ఇప్పటి వరకు తాము అంతకన్నా తక్కువే వాడుకున్నామని ఆయన చెప్పారు. గుంటూరు, ప్రకాశం జిల్లాలకు ఐదు టీఎంసిల నీటిని మాత్రమే విడుదల చేశారని ఆయన అన్నారు.
తెలంగాణకు 121.67 టిఎంసిల నీటి హక్కు ఉందని, ఆ రాష్ట్రం ఇప్పటికే 127.81 టిఎంసిల నీటిని వాడుకుందని ఆయన చెప్పారు. తాము చట్టాలకు లోబడి అవసరాలకు అనుగుణంగానే నీటిని వాడుకుంటున్నట్లు ఆయన తెలిపారు. మాకు నీరివ్వండి, మీరు విద్యుత్తు ఉత్పత్తి చేసుకోండని ఆయన తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎపిపై పంతంతోనే తెలంగాణ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోందని మంత్రి విమర్శించారు. తెలంగాణ రైతుల కరెంట్ కష్టాలు తీరాలనేది తమ ఉద్దేశమని ఆయన అన్నారు. రైతులు ఇబ్బంది పడకూడదని తాము భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఎపి నీటి కోసం ఇబ్బందులు పడుతుంటే తెలంగాణ నీటిని వృధా చేస్తోందని ఆయన తప్పు పట్టారు. ఘర్షణ లేకుండా సంయమనంతో సమస్యను పరిష్కరించుకుందామని ఆయన సూచించారు. తెలంగాణ పోలీసుల ఘర్షణ వాతావరణం సరి కాదని ఆయన అన్నారు. పంటలను కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని ఆయన చెప్పారు. కుడి, ఎడమ గట్టు కాలువల కింద ఎంత నీరు కావాలి, కృష్ణా డెల్టాకు ఎంత నీరు కావాలి అనే విషయాలు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చుని మాట్లాడుకుందామని ఆయన అన్నారు. కుడి గట్టు కాలువ కింద 8 వేల క్యూసెక్కులు రావాల్సి ఉండగా 6 వేల క్యూసెక్కులకు తగ్గించాని ఆయ చెప్పారు. వాస్తవాల ఆధారంగా కృష్ణా బోర్డు సమస్యను పరిష్కరించాలని ఆయన కోరారు. ఉన్న నీటిని ఇరు రాష్ట్రాలు సమానంగా వాడుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు.
సాగర్ నీటిని ఏపీ ప్రభుత్వం ఎక్కువగా వాడుకుందని టీ.మంత్రి హరీశ్రావు చేసిన ఆరోపణను దేవినేని ఉమ ఖండించారు. తెలంగాణ ప్రభుత్వం కావాలనే ఏపీ రైతాంగాన్ని వేధిస్తోందని ఆయన అన్నారు. రాష్ర్టాలు వేరైనా రైతు ప్రయోజనాలే ముఖ్యమని భావించినందు వల్లనే తెలంగాణ రాష్ట్ర రైతులు పులిచింతల నీటిని అధికంగా వాడుకున్నా తమ ప్రభుత్వం మాట్లాడలేదని మంత్రి అన్నారు. ఎపి అవసరాలకు మించి నీటిని వాడుకోలేదని ఆయన స్పష్టం చేశారు. నాగార్జున సాగర్ నీటి విడుదల విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి కృష్ణా బోర్డుకు లేఖ రాసింది.