సీఎం జగన్ కనుసన్నల్లో బలవంతపు ఏకగ్రీవాలు , గ్రామాల్లో బెదిరింపుల పర్వాలు : దేవినేని ఉమ ఫైర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. అధికార వైసిపి, ప్రతిపక్ష టీడీపీలు ఒకపక్క మాటల యుద్ధం చేస్తూనే మరోపక్క పంచాయతీ ఎన్నికలలో పట్టు సాధించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధిస్తూ, ఆరోపణలు చేస్తూ రాజకీయం రసకందాయంలో పడేస్తున్నారు .తాజాగా మాజీ మంత్రి దేవినేని ఉమ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఏపీలో ప్రభుత్వ తీరుపై సంచలన ఆరోపణలు చేశారు.
ఏపీని బీహార్లా మార్చేసిన జగన్ , కక్షా రాజకీయాలతో ఏది సాధించినా తాత్కాలికమే: నారా లోకేష్ ఫైర్
మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిష్ట వేసి ఏకగ్రీవాలకు అగ్రిమెంట్లు
తాడేపల్లి రాజప్రసాదం కనుసన్నల్లో, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో, ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో బలవంతపు ఏకగ్రీవాలు ప్రయత్నం చేస్తున్నారని, మంత్రులు ఎమ్మెల్యేలు గ్రామాలలో తిష్టవేసి అగ్రిమెంట్లు రాయిస్తూ ఏకగ్రీవాలు చేస్తున్నారని దేవినేని ఉమా మండిపడ్డారు. ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేయడానికి కావలసిన సర్టిఫికెట్లు జారీ చేయకుండా అడుగడుగున ఇబ్బందులకు గురి చేస్తున్నారని, విఆర్వో లు అందుబాటులో ఉండటం లేదని దేవినేని ఉమ ఆరోపించారు.
పల్లెలు బలవంతపు ఏకగ్రీవాలతో అట్టుడుకుతున్నాయన్న దేవినేని ఉమా
పల్లెలు బలవంతపు ఏకగ్రీవాలతో అట్టుడుకుతున్నాయని దేవినేని ఉమ ఆరోపించారు. వైసిపి పాలెగాళ్లు గ్రామాల మీద పడి ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారని విమర్శలు గుప్పించారు దేవినేని ఉమా. ఇదే సమయంలో వైసిపి బలవంతపు ఏకగ్రీవాలను సమర్థంగా ఎదుర్కోవాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న ఈ సమయంలో కూడా రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని దేవినేని ఉమ మండిపడ్డారు.
సర్టిఫికెట్ల జారీలో కావాలనే ఇబ్బందులు పెడుతూ వైసీపీ సర్కార్ తీరు
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సైతం వైసిపి నేత లెక్క చేయడం లేదని ఉమా విమర్శించారు. గత 20 నెలలుగా వైసిపి పాలనలో అన్ని రంగాల్లో కుదేలు అయ్యాయి అని పేర్కొన్నారు. కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వకుండా టిడిపి అభ్యర్థులను పెడుతున్నారని ఆరోపించారు . వీఆర్వోలు అందుబాటులో లేకుండా చేసి అధికారపార్టీ కుట్ర పన్నుతోందని దేవినేని ఉమ మండిపడ్డారు. టీడీపీ బలపరిచిన అభ్యర్థులు గెలిస్తే వారు గ్రామాలలో ఏమేం కార్యక్రమాలు చేస్తారు అన్న విషయాన్ని తాము దమ్ము, ధైర్యం తో వెల్లడించామని దేవినేని ఉమా పేర్కొన్నారు .
చంద్రబాబు ప్రకటన చేస్తే జగన్ ఎందుకు భయపడుతున్నారో ?
చంద్రబాబు ప్రకటన చేస్తే జగన్ ఎందుకు భయపడుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు దేవినేని ఉమా.
ఇక రాష్ట్రంలో అడుగడుగునా దౌర్జన్యాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు ఉమా. గోదావరి జిల్లాలలో వైసీపీ ఇసుక మాఫియా రెచ్చిపోతుంది అని, దేవాలయాలపై దాడులకు ప్రభుత్వానిదే బాధ్యత అని, రైతు భరోసా కేంద్రాల వల్ల ఎవరికి ఉపయోగం ఉందో చెప్పాలని ప్రభుత్వం పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఏపీ ఫైబర్ నెట్ ఆన్ చేస్తే సీఎం బొమ్మ, సాక్షి మాత్రమే కనిపిస్తున్నాయి అంటూ దేవినేని ఉమ విమర్శలు గుప్పించారు.