చంద్రబాబు పెట్టిన భిక్షతో ఎదిగి ఫేక్ సీఎం కోసం గాలి మాటలా ..కొడాలి నానీ పై దేవినేని ఉమా ఫైర్
తెలుగుదేశం పార్టీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయడంపై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నాయకుడు దేవినేని ఉమ రివర్స్ కౌంటర్ ఇచ్చారు. కొడాలి నాని నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని గాలి నాయకుడు, టిడిపిని గాలి పార్టీ అని విమర్శించిన కొడాలి నాని మాటలు గాలి మాటలని మాజీ మంత్రి దేవినేని ఉమ ఫైర్ అయ్యారు.
జీహెచ్ ఎంసీలో వైసీపీలా లాలూచీ పడలేదన్న దేవినేని ఉమా
మంత్రి పదవిని కాపాడుకోవడం కోసమే కొడాలి నాని సీఎం జగన్మోహన్ రెడ్డి వద్ద ఊడిగం చేస్తున్నాడంటూ దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేక్ సీఎం గురించి కొడాలి నాని మాట్లాడుతున్నారంటూ విమర్శల వర్షం కురిపించారు. జగన్ జీవితమే ఫేక్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు . జీహెచ్ఎంసీలో టిడిపి 106 చోట్ల పోటీ చేసిందని , వైసిపిలా లాలూచీ పడలేదని, పార్టీని ఎవరికి తాకట్టు పెట్టలేదని విమర్శించారు దేవినేని ఉమా. చంద్రబాబు భిక్షతో కొడాలి నాని ఎమ్మెల్యే అయ్యారు అన్న విషయాన్ని మర్చిపోవద్దని దేవినేని ఉమా గుర్తు చేశారు.
నాడు వైస్రాయ్ హోటల్ గేట్ ముందు నువ్వూ ఉన్నావన్న దేవినేని ఉమా
ఆకాశం మీద ఉమ్మేస్తే నీ ముఖం మీద పడుతుందంటూ కొడాలి నాని దేవినేని ఉమా పై నిప్పులు చెరిగారు. కొడాలి నాని ద్వారా విమర్శలు చేయించి, బూతులు తిట్టించి, సీఎం జగన్ మోహన్ రెడ్డి తన పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు దేవినేని ఉమా. శాసనసభలో చంద్రబాబు ప్రశ్నించే వరకూ , చంద్రబాబు నేలపై కూర్చుని నిరసన తెలియజేసేవరకు రైతుల ఇన్సూరెన్స్ డబ్బులు కట్టలేదని దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడాలి నాని పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నాడని మండిపడిన దేవినేని ఉమా నాడు వైస్రాయ్ హోటల్ గేటు ముందు చేతులు కట్టుకుని నిలబడిన వారిలో కొడాలి నాని కూడా ఉన్నారని గుర్తు చేశారు .
చంద్రబాబు పెట్టిన భిక్ష ... కొడాలి నానీ రాజకీయ జీవితం
చంద్రబాబు పెట్టిన రాజకీయ భిక్ష తో, తెలుగుదేశం పార్టీ చేసిన ఆర్థిక సహాయంతో రెండు సార్లు ఎమ్మెల్యే అయిన కొడాలి నాని, రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ నే తూలనాడుతున్నాడని , ఇంగిత జ్ఞానం మరిచి మాట్లాడుతున్నారని ,బూతులు తిడుతున్నాడని దేవినేని ఉమా అసహనం వ్యక్తం చేశారు.
వైసిపి పంచన చేరి కేవలం జగన్మోహన్ రెడ్డి పైశాచిక ఆనందం కోసం చంద్రబాబును తిడుతున్నారు అంటూ మండిపడ్డారు. ఇలాంటి పనికిమాలిన వ్యాఖ్యలు చేసే బదులు, పంట నష్టపోయి ఇబ్బంది పడుతున్న రైతులకు అండగా ఉండాలని కొడాలి నానికి హితవుపలికారు దేవినేని ఉమా.
చంద్రబాబును అనే స్థాయి నీకు లేదు .. ఉమా మండిపాటు
రాష్ట్రం అవినీతి అక్రమాలకు వేదికగా మారిందని, సామాన్యులకు ఇసుక దొరకడం లేదని, ఇసుక దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు దేవినేని ఉమా. మంత్రి కొడాలి నానికి ఇవన్నీ కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కేంద్రం నుంచి రావలసిన నిధులను తీసుకురావడంలో ఏపీ ప్రభుత్వం అడుగడుగునా ఫెయిల్ అయిందని పేర్కొన్న దేవినేని ఉమా అసమర్థ ప్రభుత్వం అంటూ నిప్పులు చెరిగారు. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు మాట్లాడితే మోసాలు బయటకు వస్తున్నాయి అన్న భయంతో సస్పెండ్ చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రజలను, రైతులను అడుగడుగునా మోసం చేస్తున్నారని మండిపడిన దేవినేని ఉమా టిడిపి నిందించే స్థాయి కొడాలి నానికి లేదని తేల్చి చెప్పారు.