కృష్ణా ప్రాజెక్టులకు నీరొస్తుంది: దేవినేని ఉమా, దురద్దేశ్యమంటూ బిజెవైఎం నేత
విజయవాడ/ న్యూఢిల్లీ: ఆగస్టు చివరి వరకు కృష్ణా ప్రాజెక్టులకు నీరు వస్తుందని ఆశిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ భారీ నీటిపారుదల శాఖ రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఆశాభావం వ్యక్తం చేశారు. పంటలను కాపాడటానికి ప్రయత్నిస్తున్నామని ఆయన బుధవారం విజయవాడలో మీడియాతో చెప్పారు.
50 లక్షల ఎకరాల్లో పంటలు వేశారని, ఇప్పటివరకు మైనస్ 8 శాతం వర్షపాతం లోటు ఉందన్నారు. ఆగస్టు 15 నుంచి పట్టిసీమ ఎత్తిపోతల నుంచి 2,500 క్యూసెక్కుల నీటిని ప్రకాశం బ్యారేజీకి తరలిస్తామని మంత్రి చెప్పారు. మంచినీటికి ఇబ్బంది లేకుండా నీటిని సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.
రైతులు ఎవరు కూడా అధైర్యపడవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రత్యామ్నాయ ప్రణాళికలతో ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల హెక్టార్లలో పంటలు వేస్తున్నారని, ప్రస్తుతం ఉన్న నీటితో పంటలను కాపాడుతామని చెప్పారు.
ఇదిలావుంటే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని ఆంధ్రప్రదేశ్ బీజేవైఎం అధ్యక్షుడు విష్ణువర్దన్రెడ్డి చెప్పారు. అయితే కొన్ని పార్టీలు ఉద్ధేశపూర్వకంగానే బీజేపీని విమర్శిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో కేంద్రమంత్రి వెంకయ్య ఆధ్వర్యంలో జరిగిన బీజేపీ యువమోర్చా సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. కేంద్రప్రభుత్వ కార్యక్రమాలను గ్రామస్థాయికి తీసుకువెళతామని, అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని ఆయన చెప్పారు.