సెర్బియా రిమాండ్లో నిమ్మగడ్డ! జగన్ ఢిల్లీ పరుగులు అందుకే, విజయసాయి కబ్జాలో రూ. 300 కోట్ల ఆశ్రమం’
అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితోపాటు మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ విజయసాయి రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడిన మాటలు ఎవరికీ అర్థం కాలేదని.. కనీసం ఆయనకైనా అర్థమైందా? అని ప్రశ్నించారు.
ఇంటర్పోల్ అదుపులోకి సీఎం జగన్ త్వరలోనే: బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు
బొత్స అప్పుడలా.. ఇప్పుడిలా..
ఆదివారం దేవినే ఉమా మీడియాతో మాట్లాడుతూ.. అవసరమైతే గడ్డం పట్టుుకంటామని, ఎన్డీఏలో చేరతామని రెండ్రోజుల క్రితం మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారని అన్నారు. ఇప్పుడేమో తాను అలా అనలేదని అంటున్నారని మండిపడ్డారు. ఢిల్లీ పర్యటనకు వెళుతూ సీఎం జగన్ లీకులు ఇవ్వడంతోనే మంత్రి బొత్స ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. పాలనా వైఫల్యాలు, అమరావతి ఉద్యమాన్ని పక్కదోవ పట్టించేందుకే ఇలాంటివి చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రధాని, హోంమంత్రి వద్దకు విదేశీ కేసులు.. అందుకే జగన్ ఢిల్లీకి..
అంతా జగన్ ఆడిస్తున్న డ్రామా అని దేవినేని ఉమా వ్యాఖ్యానించారు. జర్మనీ, సెర్బియా, ఇతర దేశాలు, గల్ఫ్ దేశాల్లో జగన్ చేసిన పాపాలు బయపడుతున్నాయని అన్నారు. సెర్బియా దేశంలో జగన్ సన్నిహితుడు సీబీఐ, ఈడీ కేసుల్లో నిమ్మగడ్డ ప్రసాద్ ఆ దేశ రిమాండ్ లో ఉన్నారని దేవినేని చెప్పారు. ఈ డబ్బంతా ఏ1 జగన్ దగ్గరికి వెళ్లిందని తెలిపారు. ఈ వాస్తవాలన్నీ దేశానికి వచ్చాయని.. ప్రధాని, హోంమంత్రి దగ్గర బట్టబయలయ్యాయని దేవినేని ఉమా అన్నారు. ఈ కేసుల్లోంచి బయటపడేందుకే జగన్ ఢిల్లీకి వెళ్లి కప్పగంతులు వేస్తున్నారని అన్నారు.
జగన్ ఢిల్లీలో ఉండగానే బొత్స వ్యాఖ్యలు..
జగన్ ఢిల్లీలో ఉండగానే అవసరమైతే కేంద్రంలో చేరతామని మంత్రి బొత్సతో చెప్పించారని అన్నారు. ఇప్పుడేమో బొత్స తాను అలా అనలేదంటున్నారని అన్నారు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు, టీడీపీని విమర్శించడం తప్ప చేసిందేమీ లేదని బొత్సపై ధ్వజమెత్తారు. బుగ్గన అనే అజ్ఞాని ఆర్థిక మంత్రిగా ఉన్నారని దేవినేని అన్నారు. అప్పులు చేసి రాష్ట్రంలో ఆర్థిక అతవ్సర పరిస్థితి వచ్చేలా చేశారని అన్నారు. త్వరలో జీతాలు, పెన్షన్లు కట్టలేని పరిస్థితులు కూడా వస్తాయన్నారు.
హైకోర్టు ధర్మాసన ధిక్కారానికి ప్రభుత్వ చర్యలు..
మండలి ఛైర్మన్ ఆదేశాలు కార్యదర్శి పాటించడం లేదని, దీనిపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. సీఎస్ సంతకం కూడా లేకుండానే అమరావతి నుంచి కర్నూలుకు కార్యాలయాలు తరలిస్తున్నారని దేవినేని ఉమా ఆరోపించారు. విశాఖపట్నం, కర్నూలు వెళతామని తీసుకుంటున్న చర్యలు హైకోర్టు ధర్మాసనం ధిక్కారానికి గురవుతున్నాయని మాజీ మంత్రి దేవినేని చెప్పారు. వైసీపీకి కోర్టులు, రాజ్యంగం, మండలి ఛైర్మన్ ఆదేశాలంటే లెక్కలేకుండా పోయిందని అన్నారు. రాష్ట్రంలో పరిపాలన గందరగోళంలో పడిందన్నారు.
బొత్సకు అవమానాలు అవసరమా?
వైఎస్ కేబినెట్లో వైఎస్కు ఎదురుతిరిగిన బొత్స.. ఇప్పుడు చేతులు ముడుచుకుని ఎందుకు ఉన్నారని దేవినేని ప్రశ్నించారు. బొత్సకు జగన్ తిట్లు, అవమానాలు అవసరమా? అని నిలదీశారు. రైతు సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మంత్రులు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని అన్నారు.
రూ. 2వేల కోట్లంటూ ఐటీదాడులపై తప్పుడు ప్రచారం చేస్తున్న వైసీపీ నేతలు.. హైదరాబాద్, ఢిల్లీలోని ఆ కంపెనీల గురించి మాట్లాడితే వీపులు పగులుతాయన్నారు.
రూ. 300 కోట్ల విశాఖ ఆశ్రమంపై విజయసాయి కన్ను, కబ్జా..
విశాఖపట్నంలోని వెంకోజీపాలెం దగ్గర జ్ఞాననంద ఆశ్రమం ఆరున్నర ఎకరాల్లో ఉందని, దీని విలువ రూ. 300 కోట్లకుపైగా ఉంటుందని చెప్పిన దేవినేని ఉమ.. ఈ ఆశ్రమంపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కన్నుపడిందన్నారు. ఆశ్రమంలో ఉన్న స్వామిని వెళ్లగొట్టి ఆ భూమిని కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. దేవాలయాలు, ఆశ్రమాలు అన్ని భూములను కబ్జా చేస్తున్నారని విజయసాయి రెడ్డిపై మండిపడ్డారు. ఆశ్రమ నిర్వాహకులకు ఇప్పటికే బెదిరింపులు వెళ్లాయన్నారు. ఏ2 ముద్దాయి వీటిపై ట్వీట్ చేయాలి.. చాలా రోజులైంది ట్వీట్ చేయక అని అన్నారు. ఎల్లో మీడియా అంటున్న వైసీపీ.. 61 రోజులుగా అమరావతిలో పోరాటం చేస్తున్న రైతుల బాధ కనిపించడం లేదని, వైసీపీ పత్రిక సాక్షిలో ఎందుకు రైతుల గురించి రావడం లేదని మండిపడ్డారు. రైతుల ఆత్మహత్యలు సాక్షికి కనిపించడం లేదా? అనిప్రశ్నించారు. హుస్సేన్ అనే మైనార్టీ సోదరుడు ఈరోజు గుండె ఆగి చనిపోయాడని తెలిపారు.