అవినీతికి కేరాఫ్ అడ్రస్.. ఇళ్ల స్థలాలు, భూములపై కన్ను, వైసీపీ నేతలపై దేవినేని ఉమా..
వైసీపీ నేతలపై మాజీమంత్రి దేవినేని ఉమమహేశ్వరరావు విరుచుకుపడ్డారు. అవినీతికి అడ్డేలేదని మండిపడ్డారు. ఇళ్ల స్థలాలు, భూముల్లో అవినీతికి పాల్పడుతున్నారని ఫైరయ్యారు. పేదల రక్తాన్ని జలగల్లా పీలుస్తున్నారని ఆరోపించారు. ఏడాదిన్నరలో జగన్ సర్కార్ చేసిందేమీ లేదని మండిపడ్డారు. సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ఇళ్ల స్థలాలు, భూముల విషయంలో వైసీపీ నేతల అవినీతీ కొనసాగుతోందని దేవినేని ఉమ అన్నారు. పెద్దల అండతోనే ఇదంతా జరుగుతోందన్నారు. ఈ మేరకు దేవినేని ఉమా ట్వీట్ చేశారు. పేదల ఇంట్లో వైసీపీ నేతల కాసుల వేట, ఇళ్ల స్థలాల పథకంలో అడుగడుగునా అవినీతి అంటూ ట్వీట్ స్టార్ట్ చేశారు. వైసీపీ నేతల జేబులు నింపుతున్న స్థలాల చదును పనులు ఇంకా కొనసాగుతున్నాయని తెలిపారు. ఇంత జరుగుతున్న ప్రభుత్వం చోద్యం చూస్తుందని చెప్పారు.
ప్రభుత్వ భూముల నుండి తెచ్చిన మట్టిని కొనుగోలు చేశామని చూపిస్తున్నారని ఆరోపించారు. వందల కోట్లు స్వాహా చేశారని మండిపడ్డారు. భూసేకరణ, మెరక పనుల్లో ప్రజా ప్రతినిధుల కుంభకోణాలపై సీబీఐ చేత విచారణ చేయించాలని అడిగారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వమే సీబీఐ విచారణ కోరాలన్నారు. అప్పుడు అవినీతి సంగతి బహిర్గతం అవుతుందని చెప్పారు. లేదంటే తాము కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామని వెల్లడించారు.
Recommended Video
ఇసుక కొరత అంశాన్ని కూడా ఉమా ప్రస్తావించారు. ఇసుకను కావాలనే బ్లాక్ చేస్తున్నారని ఆరోపించారు. అనుయాయులు కొందరు విక్రయించుకుంటున్నారని తెలిపారు. వైసీపీ నేతలు/ శ్రేణుల జేబుల్లో డబ్బులు నింపేందుకే ఇసుక అక్రమ దందా కొనసాగుతోందని చెప్పారు.