‘తోక ముడిచిన జగన్ పార్టీ-బాబును స్నేహితుడంటారా?.. అదే టీడీపీ విజయం’
న్యూఢిల్లీ/అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలోని బీజేపీపై ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల ముందు బీజేపీతో పొత్తు పెట్టుకున్నా.. నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో పోరాటం చేశామని ఉమామహేశ్వరరావు వ్యాఖ్యానించారు.
మోడీని ప్రశ్నించలేక మాపై విమర్శలా?
తమ పార్టీ ఎంపీలు పార్లమెంటు వేదికగా పోరాడారని దేవినేని చెప్పారు. పార్లమెంటులో ప్రధాని మోడీని ప్రశ్నించలేని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తమపై విమర్శలు చేయడం హాస్యాస్పదమని దేవినేని ఉమ ఎద్దేవా చేశారు. బీజేపీతో కుమ్మక్కు అయిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.. రాజీనామా డ్రామాలు ఆడి పార్లమెంట్ బయటకు వచ్చిందని విమర్శించారు.
తోకముడిచిన వైసీపీ ఎంపీలు
రాష్ట్ర సమస్యలపై టీడీపీ ఎంపీలు పార్లమెంటులో ప్రధాని మోడీని నిలదీశారని మంత్రి దేవినేని ఉమ అన్నారు. అదే సమయంలో పార్లమెంటు బయట వైసీపీ ఎంపీలు తోక ముడిచారని ఎద్దేవా చేశారు. ప్రధాని నోటి వెంట లోటు బడ్జెట్, రైల్వే జోన్, అమరావతి నిర్మాణానికి సంబంధించిన అంశాలు రాలేదని.. ఇది ఆయన అహంకార వైఖరిని సూచిస్తోందని వ్యాఖ్యానించారు.
అందుకే ఢిల్లీకి చంద్రబాబు
తెలుగు వారంటే బీజేపీ, కేంద్ర ప్రభుత్వానికి లెక్కలేదని దేవినేని మండిపడ్డారు. హామీలు సాధించుకునే వరకూ తమ పోరాటాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. మోడీ సర్కారు పార్లమెంటులో మంద బలంతో వ్యవహరించిందని విమర్శించారు. ప్రధానికి ప్రజల మనోభావాలు పట్టటం లేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రజల బాధను దేశ ప్రజలకు తెలియ పరచాలని సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లారన్నారు.
అదే మా విజయం..
ఇది ఇలా ఉండగా, అవిశ్వాసంలో నెగ్గకున్నా.. ఏపీ సమస్యలపై రోజంతా పార్లమెంట్లో చర్చ జరిగేలా చేయడమే తమ విజయమని టీడీపీ ఎంపీలు అన్నారు. మోడీ సర్కారు అసమర్థతను జాతీయ స్థాయిలో చాటామన్నారు. ప్రధాని మోడీ మాత్రం మాటల గారడీ, అసత్యాలకే పరిమితమయ్యారని దుయ్యబట్టారు.
ఇంకా బాబు మా స్నేహితుడే అంటారా?
కేంద్రం తలచుకుంటే న్యాయం చేయగలదని.. కానీ చేయట్లేదని టీడీపీ ఎంపీ సుజనా చౌదరి అన్నారు. ఒకసారి విభజన బిల్లు పాస్ అయిన తరవాత అధికారంలో ఎవరున్నారనేది కాకుండా కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పారదర్శకంగా పనిచేయాలన్నారు. ఇంకా టీడీపీ వాళ్లంతా మా స్నేహితులే అని రాజ్నాథ్ సింగ్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని మరో ఎంపీ కొనకళ్ల నారాయణ అన్నారు.