జగన్కు కౌంటర్: సీమలో దేవినేని ఉమ యాత్ర
విజయవాడ: పట్టిసీమ ప్రాజెక్టును అడ్డుకుంటున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత జగన్, ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి రాయలసీమ ద్రోహులని మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. జగన్ది ప్రాజెక్టుల యాత్ర కాదని, పశ్చాత్తాప యాత్ర అని ఎద్దేవా చేశారు. బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.
జగన్, రఘువీరాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పోలవరం ప్రాజెక్టు జాప్యానికి జగనే కారణమని ఆరోపించారు. రాయలసీమ ప్రజలు త్వరలోనే జగన్, రఘువీరాలను ఛీకొడతారని ఆయన వ్యాఖ్యానించారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం అందించేందుకు సర్వే చేయాలని అధికారులను ఆదేశించామని మంత్రి దేవినేని తెలిపారు.
జగన్ బస్సు యాత్రకు కౌంటర్గా పట్టిసీమ ఆవశ్యకతను వివరిస్తూ రాయలసీమ జిల్లాల్లో పర్యటించనున్నట్లు మంత్రి దేవినేని ఉమ చెప్పారు. ఈ నెల 16న అనంతపురంలోని హంద్రీనీవా, 17 న కడప, చిత్తూరు జిల్లాల్లోని గండికోట, నగరి, 18 న నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని కండలేరు, సోమశిల, గుండ్లకమ్మ ప్రాజెక్టులను సందర్శించనున్నట్లు మంత్రి చెప్పారు.
రైతుల రుణమాఫీ, పట్టిసీమ ప్రాజెక్టులను వ్యతిరేకించిన జగన్ను ప్రజలు గట్టి బుద్ధి చెబుతారని దేవినేని ఉమా చెప్పారు.