ఏపీకి ప్రత్యేకహోదా: కేంద్రమంత్రి చౌధురి ప్రకటనపై మంత్రి దేవినేని, నిజమేనా?
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నిధులిస్తున్నామని, అలాంటప్పుడు ప్రత్యేక హోదా అవసరం ఏముందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హరిభాయ్ చౌదరి అన్నారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014కి సవరణలు తీసుకురావాలని కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబర్స్ బిల్లుపై శుక్రవారం రాజ్యసభలో జరిగిన చర్చ అనంతరం మంత్రి చేసిన వ్యాఖ్యలివి.
ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెను కలకలం రేపుతున్నాయి. విపక్షాలతో పాటు బీజేపీ మిత్రపక్షం, ఏపీలో అధికార పార్టీ టీడీపీ కూడా ఈ ప్రకటనను కాస్తంత తీవ్రంగానే పరిగణిస్తోంది. ఈ క్రమంలో శనివారం ఉదయం విజయవాడలో ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఈ విషమయై మీడియాతో మాట్లాడారు.
కేంద్ర మంత్రి చౌధురి చేసిన ప్రకటనను పరిశీలిస్తున్నామని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయమై త్వరలోనే ప్రధాని నరేంద్ర మోడీని కలుస్తామని చెప్పారు. అంతేకాక ఏపీకి రావాల్సిన నిధుల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని కూడా ఆయన చెప్పారు. చౌధురి వ్యాఖ్యలపై వైసీపీ అధినేత వైయస్ జగన్ కూడా స్పందించారు.
ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే అవకాశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే నీరుగార్చుతున్నారని జగన్ మండిపడ్డారు. ప్రత్యేక హోదా అవసరం లేదన్నట్లుగా ఓ కేంద్రమంత్రి మాట్లాడటంపై జగన్ స్పందిచారు. ఆయన మాటలకు కారణం ఏమిటని, ఇది ధర్మమేనా? అని ఆయన ప్రశ్నించారు.
ఎన్నికల మానిఫెస్టోలో కూడా ప్రత్యేక హోదాను పెట్టారని అన్నారు. ఐదేళ్లు కాదు, పదేళ్లు హోదా ఇస్తామని ప్రచారం చేశారని చెప్పారు. హోదా రాని కారణంగా రాష్ట్రంలో పరిశ్రమలు వచ్చే పరిస్థితి లేదన్నారు. హోదా ఉంటే పారిశ్రామిక వేత్తలు ఇన్కం టాక్స్ కట్టనవసరం లేదని, కరెంటు కూడా సబ్సిడీకే ఇవ్వడం జరుగుతుందని, ట్రాన్స్ పోర్ట్ ఖర్చులు కూడా సగం రీఎంబర్స్ మెంట్ వర్తిస్తుందని చెప్పారు.
కాగా చౌధురి శుక్రవారం రాజ్యసభలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు తక్కువ సమయంలోనే ఎంతో చేశామని అన్నారు. ఇంకా ఏం చేయాలనే అంశాలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని చెప్పారు. నీతిఆయోగ్ సూచనల మేరకు ఏపీకి పన్ను మినహాయింపులు ఇస్తామని తెలిపారు. విభజన చట్టంలోని అంశాలన్నీ తప్పకుండా అమలు చేస్తామని రెండు రాష్ట్రాలకు హామీ ఇస్తున్నామన్నారు.
హోదా వస్తే ఇవన్ని ఉంటాయని, దీంతో పరిశ్రమల అభివృద్ధి బాగా జరుగుతుందని వెల్లడించారు. కాగా, ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నీరు-చెట్టు కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తోందన్న మంత్రి దేవినేని చెప్పారు. ఇక పులిచింతల నిర్వాసితులకు పునరావాసంపై తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్రావు తనతో మాట్లాడారని మంత్రి దేవినేని తెలిపారు.
ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రకాశం బ్యారీజి వద్ద నీటి మట్టం ఐదు అడుగులకు పడిపోయిందని వివరించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తాగునీటి కోసం 5 టీఎంసీల నీరు విడుదల చేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డును కోరామని తెలిపారు.