దేవయానిపై కేసు: కోకాకోలా ప్లాంటులో కార్మికుల సమ్మె
గుంటూరు: భారత దౌత్య అధికారిణి దేవయాని కోబ్రాగాడె పట్ల అగ్ర రాజ్యం అమెరికా వ్యవహరించిన తీరును నిరసిస్తూ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలోని ఆత్మకూరు కోకా కోలా ప్లాంటును సోమవారం మూసివేయాలని ఆ కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు యాజమాన్యంపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారు. కోబ్రాగాడెపై పెట్టిన కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలని అమెరికా అధ్యక్షుడు ఒబామా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సుమారు 1200 మంది కార్మికులు సోమవారం సమ్మె చేశారు.
ప్లాంటు ఎదుట ఆందోళనకు దిగిన కార్మికులు అమెరికాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అమెరికా ప్రభుత్వం వెనక్కి తగ్గనట్లయితే తాము తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కాగా కార్మికుల సమ్మెతో సుమారు 60వేల లీటర్ల సాఫ్ట్ డ్రింక్ ఉత్పత్తి నిలిచిపోయిందని అధికారులు తెలిపారు. కార్మికులు హఠాత్తుగా సమ్మెకు దిగడంతో ప్లాంటు యాజమాన్యం హైదరాబాద్, గుంటూరుల్లోని రాష్ట్ర ప్రభుత్వ కార్మికశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
మిక్సింగ్ చేసిన ద్రవాన్ని 24 గంటలలోపు ఉపయోగించకపోతే ఆ మొత్తం వృథా అవుతుందని ప్లాంటు అధికారులు చెప్పారు. హైదరాబాద్, గుంటూరు నుంచి వచ్చిన అధికారులు సమ్మెను విరమించుకోవాలని చెప్పినప్పటికీ కార్మికులు అంగీకరించకుండా సోమవారం సమ్మెకు దిగారని తెలిపారు. భారత దౌత్య అధికారిణికి జరిగిన అవమానంతో పోలిస్తే, ప్లాంటుకు జరిగే నష్టం ఎంతో చిన్నదని కార్మికులు వాదనకు దిగినట్లు అధికారులు చెప్పారు.
అమెరికా ప్రభుత్వం దేవయానిపై పెట్టిన కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలని, వేధింపులను ఆపేయాలని డిమాండ్ చేసిన ప్లాంటు గుర్తింపు కార్మిక సంఘం నాయకుడు శ్రీధర్, అమెరికా ప్రభుత్వం ఆ విధంగా చేయని పక్షంలో తమ సమ్మెను కొనసాగించేందుకు వెనకాడబోమని యాజమాన్యాన్ని హెచ్చరించారు. ప్లాంటుకు సంబంధించిన మూడు కార్మిక సంఘాలు ఒకరోజు సమ్మెలో పాల్గొన్నాయని ఆయన తెలిపారు.
కార్మికుల సమ్మె ప్లాంటు ఉత్పత్తి ప్రక్రియపై తీవ్ర ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. కాగా సమ్మె చేస్తున్న కార్మికులపై ఎలాంటి కఠిన చర్యలు చేపట్టవద్దని, సమస్య మరింత ముదిరిలే చేయవద్దని కార్మిక శాఖ అధికారులు ప్లాంటు యాజమాన్యానికి సూచించారు. కార్మికులు మంగళవారం విధుల్లో చేరేలా చూస్తామని అధికారులు యాజమాన్యానికి హామీ ఇచ్చారు.