పాదయాత్రకు చిక్కులు! అనుమతి కోరలేదన్న డీజీపీ.. తగ్గేది లేదంటున్న ముద్రగడ..
విజయవాడ : పరిస్థితి చూస్తుంటే.. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తలపెట్టిన పాదయాత్రకు అడ్డంకులు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. తాజాగా ఏపీ డీజీపీ సాంబశివరావు చేసిన ప్రకటనే ఇందుకు నిదర్శనం. పెద్ద నోట్ల రద్దు తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి మాట్లాడేందుకు మీడియా ముందుకు వచ్చిన ఆయన.. అనూహ్యంగా ముద్రగడ పాదయాత్ర గురించి మాట్లాడి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.
కుల సంఘాలు, ప్రజా సంఘాలు చేసే నిరసన ర్యాలీలకు, పాదయాత్రలకు అనుమతులిచ్చే విషయమై ఆచీతూచీ వ్యవహరిస్తామని డీజీపీ తెలిపారు. అదే సమయంలో.. ఇంతవరకు ముద్రగడ పాదయాత్రకు సంబంధించి తమనెవరూ అనుమతి కోరలేదని డీజీపీ పేర్కొన్నారు. ఒకవేళ ముద్రగడ గనుక తమ అనుమతిని కోరితే.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగవని హామి ఇస్తేనే పాదయాత్రకు అనుమతినిస్తామని తెలియజేశారు డీజీపీ. హామి ఇవ్వని పక్షంలో పాదయాత్రకు అనుమతి ఇచ్చేది లేదని తేల్చేశారు.
డీజీపీ ప్రకటన నేపథ్యంలో.. ముద్రగడ పాదయాత్రకు కొత్త చిక్కులు వచ్చిపడ్డట్టయింది. ప్రభుత్వమే ఉద్దేశ్యపూర్వకంగా పాదయాత్రకు అడ్డుపడుతుందనే వాదన కాపు ఉద్యమ వర్గాల్లో వినిపిస్తోంది. పాదయాత్రలకు అనుమతి తీసుకోవాలంటూ డీజీపీ చేసిన ప్రకటన పట్ల ముద్రగడ విస్మయం వ్యక్తం చేశారు. గతంలో చంద్రబాబు, వైఎస్ సహా పలువురు నేతలు పాదయాత్ర చేసిన దాఖలాలున్నాయని, వారంతా అనుమతి తీసుకునే పాదయాత్రలు చేశారా? అని ముద్రగడ ప్రశ్నిస్తున్నారు.
ఎవరెన్ని చెప్పినా.. ముందుగా నిర్ణయించుకున్నట్టుగానే ఈ నెల 16వ తేదీ ఉదయం 9గం.లకు రావులపాలెం ప్రధాన రహదారి నుంచి తన పాదయాత్ర జరగబోతున్నట్టు ముద్రగడ కుండబద్దలు కొట్టారు. పాదయాత్రకు అనుమతులు తీసుకోవాలని చెప్పే బదులు.. కాపుల రిజర్వేషన్ సమస్యను పరిష్కరిస్తే ఇదంతా ఉండదు కదా అని ముద్రగడ అభిప్రాయపడుతున్నారు. సమస్యలను పరిష్కరించకుండా.. పాదయాత్రకు అడ్డం తగిలే ప్రయత్నం చేస్తే.. కాపుల ఆగ్రహానికి ప్రభుత్వం గురికావడం ఖాయమని హెచ్చరిస్తున్నారు ముద్రగడ.
మొత్తానికి ఇప్పటికే ఓ దఫా ఉద్యమం ద్వారా.. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన ముద్రగడను ఇప్పటికైనా ఆపకపోతే.. ప్రభుత్వానికి డ్యామేజీ జరగవచ్చనే ఆలోచనలో అధికార పార్టీ ఉండవచ్చు. ముద్రగడ మాత్రం ఆంక్షలను ఖాతరు చేసేది లేదని స్పష్టంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. 16వ తేదీ నాడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది.