సుమోటో కేసు: హైకోర్టులో ఏపీ డీజీపీ: మద్యం అక్రమ రవాణా వాహనాలపై క్లారిఫికేషన్
అమరావతి: రాష్ట్ర పోలీస్ బాస్ గౌతమ్ సవాంగ్ ఏపీ హైకోర్టుకు హాజరయ్యారు. మద్యం అక్రమ రవాణా సందర్భంగా పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాల విషయంలో ఆయన స్వయంగా హైకోర్టు హాజరు కావాల్సి వచ్చింది. సంతృప్తికరమైన వివరణ ఇవ్వాల్సి వచ్చింది. మద్యాన్ని అక్రమంగా రవాణా చేస్తోన్న వారి నుంచి సీజ్ చేసిన వాహనాలను సంబంధిత జిల్లాల్లో మెజిస్ట్రేట్ లేదా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్కు ఎందుకు స్వాధీనం పర్చడంపై గౌతం సవాంగ్ వివరణ ఇచ్చారు.
మద్యాన్ని అక్రమంగా తరలిస్తోన్న వారి నుంచి స్వాధీనం చేసుకున్న వాహనాలు, వాటి వివరాలను ఎక్సైజ్ కానిస్టేబుళ్లు.. జిల్లా మెజిస్ట్రేట్ సమక్షానికి గానీ, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్కు గానీ అందజేయట్లేదంటూ వచ్చిన వార్తలను హైకోర్టు సుమోటోగా తీసుకుంది. దీనిపై ఇప్పటికే ఎక్సైజ్ శాఖ కమిషనర్, రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్కు నోటీసులను జారీ చేసింది. ఈ కేసు విచారణ మంగళవారం హైకోర్టు సమక్షానికి వచ్చింది. న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ ఈ కేసుపై విచారణ చేపట్టారు.
విచారణ సందర్భంగా ప్రభుత్వ తరఫు న్యాయవాది ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడం వల్ల స్వయంగా డీజీపీ హాజరు కావాలని ఆదేశించారు.బుధవారానికి కేసు వాయిదా పడింది. దీనితో- డీజీపీ స్వయంగాహైకోర్టుకు హాజరయ్యారు. ఒక్క మద్యం అక్రమ రవాణాలోనే కాకుండా వేర్వేరు కేసుల్లో తాము వాహనాలను సీజ్ చేస్తున్నామని, చట్టపరంగానే తాము వాటిని స్వాధీనం చేసుకుంటున్నామని వివరణ ఇచ్చారు.
ప్రత్యేకించి- మద్యం అక్రమ రవాణా సమయంలో భారీగా వాహనాలను స్వాధీనం చేసుకోవాల్సి వస్తోందని అన్నారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై పరిమితులు ఉన్నాయని, ఆంక్షలు కొనసాగుతున్నాయని అన్నారు. మద్య నిషేధంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాల సంఖ్యను సైతం కుదించిందని చెప్పారు. ప్రభుత్వం తీసుకుంటోన్న చర్యల వల్ల కొందరు పొరుగు రాష్ట్రాల నుంచి మద్యాన్ని అక్రమంగా మన రాష్ట్రానికి తీసుకొస్తున్నారని అన్నారు.
ఈ సందర్భంగా నిర్వహించే తనిఖీల వల్ల మద్యం బాటిళ్లతో పాటు వాటిని తరలించడానికి వినియోగించిన వాహనాలను కూడా తాము సీజ్ చేస్తున్నామని గౌతమ్ సవాంగ్ వివరించారు. స్వాధీనం చేసుకున్న వాహనాలను జిల్లా మెజిస్ట్రేట్ లేదా ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారికి అప్పగించాల్సి ఉంటుందని, ఇందులో జాప్యం చోటు చేసుకుంటోందనే విషయం తన దృష్టికి వచ్చిందని అన్నారు. ఈ జాప్యాన్ని తొలగించేలా తక్షణ చర్యలను తీసుకుంటామని అన్నారు.
Recommended Video
ఇందులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చట్టపరమైన తగిన చర్యలు తీసుకుంటామని, ఈ దిశగా ఇప్పటికే అన్ని జిల్లాల ఎక్సైజ్ శాఖ అధికారులకు ఓ సర్క్యులర్ను జారీ చేశామని అన్నారు. ఇకపై ఈ జాప్యం లేకుండా జాగ్రత్తలను తీసుకుంటామని చెప్పారు. వాహనాలను స్వాధీనం చేసుకున్న వెంటనే వాటిని ఉన్నతాధికారులు లేదా జిల్లా న్యాయస్థానం సమక్షానికి తీసుకెళ్తామని అన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.