అనురాధను ఎవరి చంపారో నిర్ధారణకొచ్చాం, సిబిఐతో సమానంగా సిఐడీ: డిజిపి
రాజమండ్రి: చిత్తూరు నగర మేయర్ అనురాధ దంపతుల హత్య కేసులో ఓ నిర్ధారణకు వచ్చినట్లు డిజిపి జేవీ రాముడు శనివారం నాడు తెలిపారు. వారిని ఎవరు చంపారన్న విషయమై ఓ నిర్ధారణకు వచ్చామన్నారు. దర్యాఫ్తును వేగవంతం చేశామన్నారు.
సీబీఐతో సమానంగా రాష్ట్రంలో సీఐడీ పని చేస్తోందని కితాబిచ్చారు. టెక్నాలజీ, పోలీసులకు శిక్షణపై ప్రాధాన్యమిస్తున్నామన్నారు.
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో నేర పరిశోధనా విభాగం ప్రాంతీయ కార్యాలయానికి ఆయన శంకుస్థాపన చేశారు. అర్చకుల వేదమంత్రాల మధ్య భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
మేయర్ కుటుంబ సభ్యులకు భద్రత
అనురాధ దంపతుల హత్య నేపథ్యంలో పోలీసులు వారి కుటుంబ సభ్యులకు భద్రత కల్పించారు. వారి కొడుకు కఠారి ప్రవీణ్, మేయర్ తమ్ముళ్లు గోపి, కిషోర్, కార్పోరేటర్ కందా, కఠారి మోహన్కు నమ్మిన బంటుగా ఉన్న ప్రసన్నలను కూడా హత్య చేయాలని ప్లాన్ చేసినట్టు పోలీసుల అదుపులో ఉన్న నిందితులు విచారణలో వెల్లడించారు. దీంతో బందోబస్తు ఏర్పాటు చేశారు.
దాంతో మేయర్ ఇంటి వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు హత్య జరిగిన సమయంలో దుండగుల దాడిలో గాయపడిన సతీష్ వేలూరు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం అతన్ని చిత్తూరు డీఎస్పీ లక్ష్మీనాయుడు విచారించారు. ఇతనికి సైతం పోలీసులు భద్రత కల్పించారు.