అమరావతి పోలీస్ కమిషనర్గా లక్ష్మీనారాయణ?: తీసుకురామని డిజిపి
హైదరాబాద్: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) మాజీ జేడీ లక్ష్మీ నారాయణను రాష్ట్రానికి తీసుకు వచ్చే ప్రతిపాదన ఏదీ లేదని ఏపీ డిజిపి జేవీ రాముడు బుధవారం నాడు చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరి బెటాలియన్లో కల్యాణ మండపం నిర్మాణానికి బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. రాజధాని ప్రాంతంలో ఎలాంటి మావోయిస్టుల కదలికలు లేవన్నారు. రాజధాని అమరావతిలో అప్పా తరహాలో శిక్షణ కేంద్రాన్ని నెలకొల్పుతామని చెప్పారు. మంగళగిరి బెటాలియన్లో పోలీసు ఆయుధ కారాగారాన్ని నిర్మిస్తామన్నారు.
కాగా, మహారాష్ట్ర కేడర్ సీనియర్ ఐపీఎస్ అధికారి, సీబీఐ జాయింట్ డైరెక్టర్గా పలు సంచలన కేసులను ఛేదించిన లక్ష్మీ నారాయణ... నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి పోలీస్ కమిషనర్గా రానున్నారని ఊహాగానాలు వినిపించాయి. జగన్ అక్రమాస్తుల కేసు దర్యాప్తు బాధ్యతలను చేపట్టిన లక్ష్మీనారాయణ... కేసులో పలు కీలక ఆధారాలను సేకరించి జగన్ను ఏకంగా అరెస్ట్ చేశారు.
ఓబుళాపురం అక్రమ గనులకు సంబంధించిన కేసును కూడా లక్ష్మీనారాయణే చేపట్టారు. ఈ కేసులోనూ ఆయన కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డిని కటకటాల వెనక్కు నెట్టారు. ఈ రెండు కేసుల దర్యాప్తులో మెరుగైన పనితీరు కనబరచిన లక్ష్మీనారాయణ సమర్ధవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు.
ఆ తర్వాత లక్ష్మీనారాయణ తన సొంత కేడర్ అయిన మహారాష్ట్రకు బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఆయన మహారాష్ట్రలో అదనపు డీజీ హోదాలో పని చేస్తున్నారు. అయితే ఏపీలో టీడీపీ అదికారంలోకి రావడం, నవ్యాంధ్ర నూతన రాజధాని కేంద్రంగా కొత్త కమిషనరేట్ను ప్రారంభిస్తున్నారన్న వార్తల నేపథ్యంలో ఉన్న పళంగా లక్ష్మీనారాయణ పేరు తెరపైకి వచ్చింది.
లక్ష్మీనారాయణ అమరావతి కమిషనర్గా వస్తున్నారని ఎవరు ప్రచారం మొదలెట్టారో తెలియదు కాని, ఈ విషయం ఏపీలో హాట్ టాపిక్గా మారింది. అయితే ఈ ప్రచారాన్ని లక్ష్మీనారాయణ స్వయంగా కొట్టిపారేశారు. ఇప్పుడు డిజిపి కూడా కొట్టి పారేశారు.
లక్ష్మీ నారాయణ ఓ తెలుగు టీవీ ఛానెల్తో మాట్లాడుతూ.. తాను అమరావతి పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపడుతున్నానని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు.
ఒకవేళ ఆ ప్రతిపాదన ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చినా అంగీకరించబోనన్నారు. దీనికి ఆయన కారణం కూడా చెప్పారు. ప్రస్తుతం అదనపు డీజీ ర్యాంకులో ఉన్న తాను అంతకంటే తక్కువ స్థాయి ర్యాంకు ఉన్న అధికారి చేపట్టాల్సిన అమరావతి పోలీస్ కమిషనర్ పదవిని చేపట్టబోనని చెప్పారు.
గుంటూరులో టిడిపి కార్యాలయం ప్రారంభం
ఈ నెల 29 నుంచి గుంటూరు కేంద్రంగా టిడిపి రాష్ట్రస్థాయి కార్యక్రమాలు కొనసాగబోతున్నాయి. ఇప్పటి వరకు జిల్లా కార్యాలయంగా ఉన్న ఎన్టీఆర్ భవన్ను రాష్ట్ర పార్టీ కోసం కేటాయించిన తర్వాత గుంటూరు నగరంలోని బృందావన్ గార్డెన్స్లో పార్టీ జిల్లా కార్యాలయాన్ని ఇవాళ ప్రారంభించారు.
టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు జేవీ పుష్పరాజ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీఎస్ ఆంజనేయులు, ఎమ్మెల్యేలు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, తెనాలి శ్రావణ్ కుమార్ కార్యక్రమంలో పాల్గొన్నారు.