మాచర్ల దాడి ఘటనపై స్పందించిన డీజీపీ: ఎన్నికల సంఘానికి సమాచారం ఇస్తున్నాం
మాచర్లలో టీడీపీ నేతలు బుద్దా వెంకన్న ,బోండా ఉమాలపై దాడి ఘటన రాష్ట్రంలో దుమారం రేపింది . స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో దాడులు, దౌర్జన్యాలు కొనసాగుతున్నాయని, నామినేషన్లు వెయ్యకుండా అడ్డుకుంటున్నారని నామినేషన్ పత్రాలు చించి వేశారని టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. ఇక ఈ ఘటన నేపధ్యంలో మాజీ సీఎం చంద్రబాబు గవర్నగర్ బిస్వభూషణ్ హరిచందన్ కు అలాగే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు .రీ నోటిఫికేషన్ ఇవ్వాలని కోరారు. ఇక ఈ ఘటనపై హై కోర్టును కూడా ఆశ్రయించారు. హైకోర్టు సైతం డీజీపీని కోర్టుకు పిలిచి మరీ విచారణ జరిపింది.
దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటాం
మాచర్లలో టీడీపీ నేతలపై దాడి సంఘటన జరిగిన రోజే డీజీపీ గౌతమ్ సవాంగ్ అసలు సంఘటనపై నివేదిక కావాలని ఆదేశించారు. సంఘటన స్థలానికి వెళ్ళిన జిల్లా ఎస్పీ అక్కడ జరిగిన ఘటనపై పూర్తి వివరాలు సేకరించారు . సంఘటనా స్థలానికి చేరుకుని పూర్తి నివేదిక ఇవ్వాలని డీజీపీ సవాంగ్ గుంటూరు ఐజీని ఆదేశించారు. డీజీపీ ఆదేశాలతో గుంటూరు ఐజీ ఈ ఘటనపై పూర్తి నివేదిక ఇచ్చారు. ఇక దీనిపై స్పందించిన డీజీపీ గౌతమ్ సవాంగ్ ఈ ఘటనకు బాధ్యులపైన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ప్రతిపక్ష పార్టీల ఫిర్యాదులు తీసుకుని తక్షణమే విచారిస్తున్నాం
ప్రతి పక్ష పార్టీ సహా అన్ని పార్టీల నాయకులు ఇచ్చిన ఫిర్యాదులు స్వీకరిస్తున్నామని డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు . వచ్చిన అన్ని ఫిర్యాదులపైన తక్షణమే విచారణ జరిపిస్తున్నామని చెప్పిన ఆయన అంతే కాక ఘటన వివరాలు ,దర్యాప్తు సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘానికి అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు . మాచర్ల ఘటన పైన సెక్షన్ 307 కింద నమోదు చేయలేదని ప్రతిపక్ష పార్టీల వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని ఆయన పేర్కొన్నారు.
Recommended Video
ముగ్గురు నిందితులు గురజాల సబ్-జైల్లో ఉన్నారన్న డీజీపీ
మాచర్ల ఘటనపై సెక్షన్ 307 కింద నిందితులను అరెస్టు చేశామని ప్రస్తుతము గురజాల సబ్-జైల్లో ఈ ఘటనకు బాధ్యులైన ముగ్గురు నిందితులు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చిన తరువాతే వెళ్లామని టిడిపి నేతలు బోండా ఉమా, బుద్దా వెంకన్న చెప్పారని దాని మీద కూడా విచారణ జరుపుతున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతుందని డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. ఎన్నికల దృష్టా పోలీసులు అన్నివేళల అప్రమత్తంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఎక్కడ ఏ సంఘటన జరిగినా తక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పారు.