మా కులం అది మాత్రమే: డీఎస్పీ పదోన్నతులపై జగన్కు డీజీపీ దిమ్మతిరిగే కౌంటర్
తిరుపతి: చిత్తూరు జిల్లా తిరుపతిలో ఆరు రాష్ట్రాల పోలీస్ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. త్వరలో సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఈ అంశంపై ఆరు రాష్ట్రాల పోలీస్ ఉన్నతాధికారులు చర్చించారు. మద్యం, డబ్బు తరలింపును అడ్డుకోవడానికి గల చర్యలపై సమీక్షించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఠాకూర్ మీడియాతో మాట్లాడారు. నక్సల్స్ ప్రభావం ఉన్న ప్రాంతాలపై దృష్టి సారించినట్లు చెప్పారు. సరిహద్దు రాష్ట్రాలతో కలిసి సమన్వయం చేసుకుంటామని అన్నారు.
నేను అందుకే ఏపీకి వచ్చా: అమిత్ షాకు చేదు అనుభవం, టీడీపీ శిరీష అరెస్ట్
మాకు కులం ఉండదు
ఈ సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి కౌంటర్ డీజీపీ ఇచ్చారు. పోలీసులకు కులం అనేది ఉండదని, కేవలం ఖాకీ మాత్రమే తమ కులమని చెప్పారు. జగన్ ఢిల్లీలో ఫిర్యాదు చేసిన విషయం మీడియా ద్వారా తెలిసిందని చెప్పారు. ప్రమోషన్లను సీనియార్టీ ప్రకారమే ఇచ్చామని చెప్పారు.
ఇదీ జగన్ ఆరోపణ
వైసీపీ అధినేత వైయస్ జగన్ ఢిల్లీకి వెళ్లి ఏపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఏపీ పోలీసు అధికారుల పదోన్నతులపై ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. సీఎం సామాజిక వర్గం వారికి ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. 37 మంది డీఎస్పీలకు ప్రమోషన్లు ఇస్తే అందులో సీఎం సామాజిక వర్గానికి చెందిన వారు 35 మంది ఉన్నారని జగన్ ఆరోపించారు. అయితే ప్రభుత్వ వర్గాలు చెప్పిన లెక్క ప్రకారం 2014 ఫిబ్రవరి వరకు ప్రమోషన్ ప్యానెల్లో ఉన్న 21 మందికి ఇప్పటికే డీఎస్పీలుగా ప్రమోషన్లు ఇచ్చారు. వీరిలో అన్ని కులాల వారు ఉన్నారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు నలుగురు ఉన్నారు. 2018 సంవత్సరం వరకూ ప్యానల్ను ఆమోదిస్తే రెగ్యులర్ డీఎస్పీలుగా ప్రమోషన్ పొందబోయే వారు మరో 35 మంది ఉంటారు. ఇందులో ఆయా సామాజిక వర్గాల వారు ఉన్నారు. వీరి విషయంలో జగన్ ఆరోపణలు చేశారు. వీరు ప్రమోషన్లు అందుకోనున్నారు. కానీ ఇందులో ఇద్దరు మాత్రమే కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు ఉన్నారు. ఇది వైసీపీని ఇరకాటంలో పెట్టేదే అని అంటున్నారు.
జగన్కు రివర్స్
ప్రస్తుత టీడీపీ హయాంలో పదోన్నతుల విషయాన్ని పక్కన పెడితే 2004-2014 మధ్య కాంగ్రెస్ హయాంలో పదోన్నతులు పొందిన వారిలో రెడ్లు ఎక్కువగా ఉన్నారని, అందులో 2004 నుంచి 2009 సెప్టెంబర్ వరకు వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్నారనేది టీడీపీ వాదన.
జైలుకు పోతానని జగన్కు భయం పట్టుకుంది
ప్రమోషన్లలో రిజర్వేషన్లు పాటించాలని హోంమంత్రి చినరాజప్ప అన్నారు. ఒక్క పోస్ట్ కూడా డైవర్ట్ కాలేదని చెప్పారు. ఒక్క వర్గానికి అన్ని వచ్చాయని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ప్రమోషన్లపై తాము ఛాలెంజ్ చేస్తున్నామని, చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. డీజీపీ ఠాకూర్ వచ్చాక పోలీస్ శాఖ మరింత గాడిన పడిందని చెప్పారు. తాను బయట ఉంటానా లేక జైలుకు పోతానా అనే భయం జగన్కు పట్టుకుందని ఎద్దేవా చేశారు. ప్రమోషన్ల పైన శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు. 35 మంది ఓసీలకు నాలుగేళ్లలో ప్రమోషన్లు వచ్చాయన్నారు. ఓ సామాజిక వర్గానికి 35 మందికి ప్రమోషన్లు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.