మావోయిస్టుల దాడిపై అన్ని కోణాల్లో దర్యాప్తు...ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించాం:డీజీపీ ఆర్పీ ఠాకూర్
విశాఖపట్టణం:మావోయిస్టుల దాడిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఎపి డీజీపీ ఆర్పీ ఠాకూర్ చెప్పారు. విశాఖకు విచ్చేసిన అనంతరం డీఐజీ శ్రీకాంత్ తో కలసి ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, సోమ హత్యకు గురైన ప్రాంతాన్ని పరిశీలించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ దాడులకు బాధ్యులపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రామగూడ ఘటన తర్వాత కూడా మావోయిస్టులు పలుమార్లు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారని గుర్తుచేశారు. ఈ ఘటనలో పోలీస్ శాఖ వైఫల్యం లేదన్నారు. ఇక మావోయిస్టుల దాడికి సంబంధించి సిట్ అన్ని కోణాల్లో సమగ్రంగా దర్యాప్తు చేస్తుందని ఠాకూర్ వెల్లడించారు.
మావోయిస్టుల దాడి నేపథ్యంలో అమెరికా పర్యటన అర్థాంతరంగా రద్దు చేసుకొని విశాఖ జిల్లాకు విచ్చేసిన ఎపి డిజిపి ఠాకూర్ విశాఖ మన్యంలో పర్యటించారు. ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ ను మావోయిస్టులు హతమార్చిన డుంబ్రిగూడ మండలం లివిటిపుట్టు ప్రాంతాన్ని డీజీపీ పరిశీలించారు. మావోయిస్టుల దాడి, అనంతర పరిణామాలపై స్థానిక పోలీసు అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మావోయిస్టుల దాడిలో ప్రజాప్రతినిధులు మృతి చెందడం బాధాకరమన్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే చాలా కీలక ఆధారాలు సేకరించామని తెలిపారు. కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందం ఏర్పాటు చేయగా విచారణలో పురోగతి కనిపిస్తోందన్నారు. మన్యంలో మావోయిస్టులు లేరని తాము ఎప్పుడూ చెప్పలేదని,ఈ ప్రాంతంలో వారి కార్యకలాపాలు బాగా తగ్గాయని మాత్రమే చెప్పామని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.
పోలీసుల వైపు నుంచి ఏమైనా లోపాలు ఉంటే వెంటనే సరిదిద్దుతామని చెప్పారు. రాంగూడ ఎన్కౌంటర్ తర్వాత పోలీసులపై మావోయిస్టులు దాడి చేసేందుకు అనేక సార్లు ప్రయత్నించారని...అయితే పోలీసులు చాలా అప్రమత్తతో వ్యవహరించి తిప్పికొట్టారని డీజీపీ చెప్పుకొచ్చారు. లివిటిపుట్టుకు కొద్దిదూరంలోనే ఒడిశా సరిహద్దు ఉందని...ఆ సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులు షెల్టర్ ఏర్పాటు చేసుకుని దాడికి పాల్పడ్డారని అన్నారు. మావోయిస్టులను పట్టుకునేందుకు ఒడిశా డీజీపీతో మాట్లాడి వారితో సమన్వయం చేసుకుంటూ ఏవోబీ ప్రాంతాల్లో పటిష్ఠ నిఘా ఏర్పాటు చేయనున్నట్లు ఎపి డిజిపి ఠాకూర్ వివరించారు.