అసలేం జరుగుతోంది?: వైజాగ్ పోలీసులు ఎందుకిలా?, డీజీపీ ఫైర్.. ఆ అరగంట ఒంటరిగా?
సమావేశం మధ్యలో డీజీపీ అరగంట పాటు ఎక్కడికో వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది.
విశాఖపట్నం: హత్యలు, నేరాల్లో విశాఖపట్నం పోలీసులు పట్టుబడుతుండటం పోలీస్ వ్యవస్థ ఇమేజ్ దెబ్బతీసేలా మారింది. విషయాన్ని తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర డీజీపీ సాంబశివరావు జిల్లా పోలీసులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
దారితప్పుతున్న పోలీసుల పరివర్తన, జిల్లాలో పరిస్థితులపై ఆయన ఆరా తీశారు. ఇకనైనా తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. విశాఖపట్నంతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లా,రాజమండ్రి అర్బన్, విశాఖ పోలీస్ కమిషనరేట్ అధికారులు, ఎక్సైజ్ ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు.
Recommended Video
పోలీసులకు చెడ్డపేరు
ఇటీవల గంజాయి అక్రమ రవాణాలో ఎక్సైజ్ పోలీసులు పట్టుబడటం, అలాగే ఓ హత్య కేసులో డీఎస్పీ రవిబాబు పాత్ర బయటపడటం, విశాఖకే చెందిన ఇద్దరు పోలీస్ అధికారులు రాజస్థాన్లో లంచం తీసుకుంటూ పట్టుబడటం వంటివి విశాఖ పోలీస్ వ్యవస్థకు మచ్చ తెచ్చేవిగా మారాయి. దీంతో డీజీపీ విషయాన్ని తీవ్రంగా పరిగణించారు. నిజానికి గంజాయి నిర్మూలన అంశంపైనే సమావేశం నిర్వహించినప్పటికీ ఇటీవలి కేసులు కూడా చర్చకు వచ్చాయి.
ఏం చేస్తున్నారు?
సమావేశం సందర్బంగా డీజీపీ విశాఖ పోలీసులకు క్లాస్ పీకారు. మీరేం చేస్తున్నారో? ఇక్కడేం జరుగుతుందో అంతా తెలుసని అన్నారు. ప్రశాంతతకు కేరాఫ్ అయిన విశాఖలో పరిస్థితులు మెల్లిగా మారిపోతున్నాయని, ఇంత జరుగుతుంటే ఏం చేస్తున్నారని మండిపడ్డారు. క్రైమ్ రేటు అదుపు తప్పుతున్నా.. ఎందుకు గమనించడం లేదని ప్రశ్నించారు. పరువు తీస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
గంజాయి నిర్మూలనపై చర్చ సందర్భంగా ఓ టాస్క్ ఫోర్స్ అధికారి సమాధానం చెప్పబోయారు. దీంతో మధ్యలో కల్పించుకున్న డీజీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు టాస్క్ ఫోర్స్ లో ఏం జరుగుతోందని ప్రశ్నించారు. టాస్క్ ఫోర్స్ శాఖపైనే లెక్కలేనన్ని ఫిర్యాదులు అందుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతవరకు ఓకె.. కానీ
హత్య కేసులో డీఎస్పీపై సైతం నిష్పక్షపాతంగా కేసు నమోదు చేయడం వరకు బాగానే ఉందని, కానీ వాటి దర్యాప్తు విషయాలు ముందుగానే ఎందుకు లీక్ అయ్యాయని ప్రశ్నించారు. ముందే పత్రికలకు విషయం లీక్ చేశారా?.. లేక వాటి ఆధారంగానే మీ దర్యాప్తు కొనసాగిందా? అని సందేహం వ్యక్తం చేశారు.
ఆ అరగంట ఎక్కడికి?:
సమావేశం మధ్యలో డీజీపీ అరగంట పాటు ఎక్కడికో వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది. ఎటువంటి సెక్యూరిటీ లేకుండానే ఆయన ఒంటరిగా కారులో వెళ్లిపోయినట్టు చెబుతున్నారు. మధ్యాహ్నాం 3.15గం. ఎస్పీలు, కమిషనర్లు, ఎక్సైజ్ అధికారులతో ప్రారంభమైన డీజీపీ సమావేశం రెండు గంటలు పైనే సాగింది. అనంతరం ఆయన బయటకెళ్లినట్టు తెలుస్తోంది.
తిరిగి ప్రెస్ మీట్కు సరిగ్గా ఆరు గంటలకు కొంచెం ముందు ఆయన తిరిగి వచ్చినట్టు సమాచారం. దీంతో ఆయనెక్కడికి వెళ్లి ఉంటారన్న దానిపై ఆరా మొదలైంది. అయితే డీజీపీ సంపత్ వినాయగర్ స్వామి ఆలయానికి వెళ్లి వచ్చారని, దేవాలయానికి సెక్యూరిటి ఎందుకని ఓ పోలీస్ అధికారి చెప్పినట్టు తెలుస్తోంది.