ఎర్రచందనం.. మద్యం: ఏపీ, తెలంగాణ మధ్య నిఘా బలోపేతం: దక్షిణాది రాష్ట్రాల్లో పవర్ఫుల్గా
అమరావతి: దక్షిణాది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నేరాలను నియంత్రించడానికి ఆయా రాష్ట్రాల పోలీసులు ఉమ్మడిగా పని చేయనున్నారు. ఒక రాష్ట్రంలో నేరాలకు పాల్పడి.. మరో రాష్ట్రానికి వెళ్లి తలదాచుకుంటున్న వారిని బంధించడంలో నెలకొన్న కొన్ని శాఖాపరమైన నిబంధనల్లో సవరించాలని నిర్ణయించారు. దీనికోసం తీసుకోవాల్సిన చర్యలపై దక్షిణాది రాష్ట్రాల డీజీపీలు శనివారం సమావేశం అయ్యారు. పలు కీలక అంశాలను చర్చించారు. ఎర్రచందనం స్మగ్లింగ్, మద్యం, మనుషుల అక్రమ రవాణా, ఉగ్రవాదాన్ని నిర్మూలించడంపై ప్రాథమిక నిర్ణయాలను తీసుకున్నారు.
అయిదు రాష్ట్రాల డీజీపీలతో
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొనసాగిన ఈ భేటీలో గౌతమ్ సవాంగ్ (ఏపీ), పీ మహేందర్ రెడ్డి (తెలంగాణ), లోక్నాధ్ బెహరా (కేరళ), జేకే త్రిపాఠి (తమిళనాడు), ప్రవీణ్ సుదీప్ (కర్ణాటక) ఇతర అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రాల మధ్య భద్రత, నేరాల నియంత్రణ, ఎర్రచందనం స్మగ్లింగ్, గంజాయి తరలింపు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వంటి నేరాలను నియంత్రించడానికి ఉమ్మడిగా కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నారు. నేరస్తుల సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం, వారిని నిర్బంధంలోకి తీసుకునే విషయంలో ఉన్న అడ్డంకులను తొలగించుకోవడం వంటి అంశాలు వారి మధ్య చర్యకు వచ్చాయి.
ఎర్రచందనం స్మగ్లింగ సహా..
ఏపీ, తమిళనాడు మధ్య ఎర్రచందనం స్మగ్లింగ్ సమస్య తీవ్రంగా ఉంటోందని డీజీపీ గౌతం సవాంగ్ వివరించారు. దీనిపై జేకే త్రిపాఠి స్పందించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ను నియంత్రించడానికి ఏపీ పోలీసులతో కలిసి పని చేస్తామని అన్నారు. అవసరమైతే జాయింట్ టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని చెప్పారు. జాయింట్ టాస్క్ఫోర్స్ ఏర్పాటుపై ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో మద్య నియంత్రణ చర్యలను తీసుకున్న తరువాత తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున లిక్కర్ సరఫరా అవుతోందని ఏపీ డీజీపీ సూచించగా.. దాన్ని అరికట్టడానికి సరిహద్దుల్లో నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని డీజీపీ మహేందర్ రెడ్డి చెప్పారు.
ఉగ్రవాదాన్ని అణచివేయడానికి
దక్షిణాది రాష్ట్రాలతోపాటు పుదుచ్చేరి, లక్షద్వీప్ మధ్య పరస్పర సహాయ సహకరాలు, నేర నియంత్రణపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కేరళ, కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లో ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగుతున్నాయనే విషయం ఆయా రాష్ట్రాల డీజీల మధ్య ప్రస్తావనకు వచ్చింది. కేరళలోని కాసరగోడ్, తమిళనాడులోని కోయంబత్తూర్, కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలను కేంద్రంబిందువుగా చేసుకుని ఇదివరకు ఉగ్రవాద కార్యకలాపాలు వెలుగులోకి వచ్చిందని పేర్కొన్నారు.
Recommended Video
జాతీయ సంస్థలతో..
ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సహా కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రాల్లో విస్తరిస్తున్న మావోయిస్టు కార్యకలాపాలను కట్టడి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తీర ప్రాంతంలో గస్తీని మరింత పటిష్టం చేయడంతో పాటు జలమార్గంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడానికి ఉమ్మడిగా పని చేయాలని నిర్ణయించారు. మద్యం, గంజాయి వంటి అక్రమ రవాణాను నియంత్రించడానికి ఏపీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎన్ఫోర్స్మెంబ్ బ్యూరో (ఎస్ఈబీ) విస్తృత సోదాలను నిర్వహిస్తోందనే విషయాన్ని గౌతమ్ సవాంగ్ వారికి వివరించారు.