చంద్రబాబును కడిగిపారేసిన ధర్మాన, నోరు మెదపాలని హెచ్చరిక..
విజయవాడ : సదావర్తి భూముల వేలానికి సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు ప్రతిపక్ష వైసీపీ నేతలు. తాజాగా దీనిపై స్పందించిన వైసీపీ నేత, నిజ నిర్దారణ కమిటీ అధ్యక్షుడు ధర్మాన ప్రసాదరావు సీఎం చంద్రబాబుపై ఫైర్ అయ్యారు.
సదావర్తి సత్రం భూముల వేలాన్ని తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేసిన ఆయన, ఇకనైనా సీఎం చంద్రబాబు దీనిపై నోరు మెదిపితే మంచిదన్నారు. సదావర్తి భూముల్లొ చోటు చేసుకున్న అక్రమాలకు సంబంధించి పార్టీ అధినేత జగన్ కు నివేదిక అందజేసినట్టు తెలిపారు.
చంద్రబాబు ఆదేశాలతోనే దేవాదాయ శాఖ సదావర్తి భూముల అమ్మకానికి సిద్దపడిందన్న ఆయన, ఇదే విషయమై ఆరా తీయడానికి అమరావతి, చెన్నై వెళ్లి వివరాలు సేకరించినట్టు చెప్పారు. ఏపీ తమిళనాడు మధ్య ఉన్న ఈ వివాదంలో కేబినేట్, గవర్నర్ కు కూడా తెలియకుండా నిర్ణయాలు జరిగిపోయాయన్నారు.
చంద్రబాబు ప్రభుత్వం హిందూ దేవాలయాల పరిరక్షణలో విఫలమైందన్నారు ధర్మాన. సదావర్తి భూములను వేలం వేయాలనుకుంటే, ఈ-టెండర్లను ఎందుకు పిలవలేదని ప్రభుత్వాన్ని నిలదీసిన ధర్మాన, విషయాన్ని తమిళనాడు ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లకుండా ఏం చేశారని ప్రశ్నించారు.
ఎకరా రూ.6.50 కోట్ల విలువ చేసే భూములను టీడీపీ నేతలకు కారు చౌకగా కేవలం రూ.27 లక్షలకే ఎలా కట్టబెడుతారని మండిపడ్డారు. ప్రస్తుతం సదావర్తి భూములకు సంబంధించి ప్రాథమిక నివేదికను మాత్రమే తమ పార్టీ అధినేత జగన్ కు అందజేశామని చెప్పిన ధర్మాన, త్వరలోనే పూర్తి నివేదికను అందజేస్తామన్నారు.
సదావర్తి భూముల అక్రమాలకు సంబంధించి తుది నివేదికలో ప్రతీ అంశం బయటకు వస్తుందని, కుంభకోణంలో డబ్బులు ఎక్కడినుంచి వచ్చాయి..? ఎవరెవరి చేతులు మారాయి..? వంటి విషయాలన్ని అందులో తేట తెల్లమవుతాయని అన్నారు. నిజాలన్ని బయటపడితే దీనిపై న్యాయ పోరాటం తప్పదని విషయంపై అసెంబ్లీలోనే ప్రభుత్వాన్ని ఎదుర్కొంటామని ప్రకటించారు.
కుంభకోణం విషయాన్ని మోడీ దృష్టికి కూడా తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నామన్నారు ధర్మాన. కుంభకోణంలో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేనప్పుడు చంద్రబాబు ఎందుకు స్పందించట్లేదని, ఇప్పటికైనా చేసిన తప్పును సరిదిద్దుకునే అవకాశం చంద్రబాబుకు ఉందన్నారు.