బాబ్లీ కేసు: చంద్రబాబుకు త్వరలో కోర్టు నోటీసులు!, ఏపీ ముందస్తుపై లోకేష్ ఏమన్నారంటే?
హైదరాబాద్/అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి మహారాష్ట్ర ధర్మాబాద్ కోర్టు త్వరలోనే నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం. మహారాష్ట్రలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన బాబ్లీ డ్యామ్ సందర్శనకు 2010, జూలైలో చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ నేతలు వెళ్లిన విషయం తెలిసిందే.
చంద్రబాబు సహా నేతల అరెస్ట్
తొలుత డ్యామ్ సందర్శనకు అనుమతిస్తామని చెప్పిన పోలీసులు, ఆ తర్వాత చంద్రబాబు సహా పలువురు నాయకులను అరెస్ట్ చేసి ధర్మాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో ఆందోళనకు దిగిన టీడీపీ కార్యకర్తలపై మహారాష్ట్ర పోలీసులు లాఠీలు ఝుళిపించారు.
చారిత్రక ఘట్టం, ఎంతో ఆనందం: పోలవరం గ్యాలరీ వాక్లో చంద్రబాబు ఫ్యామిలీ
త్వరలోనే నోటీసులు..
ఆ తర్వాత టీడీపీ నేతలతో పాటు 76 మంది కార్యకర్తలను అరెస్ట్ చేశారు. అనుమతి లేకుండా బాబ్లీ డ్యామ్ వద్ద ఆందోళనలు చేసినట్లు పోలీసులు ఈ సందర్భంగా కేసు నమోదుచేశారు. దీనికి సంబంధించి ధర్మాబాద్ కోర్టు చంద్రబాబుకు త్వరలోనే నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ మేరకు హిందీ మీడియాలో పలు కథనాలు వెలువడ్డాయి.
తెగువ చూపారంటూ లోకేష్
కాగా, ఈ నోటీసుల విషయంపై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. తెలంగాణ ప్రయోజనాల కోసం నాడు బాబ్లీ కోసం చంద్రబాబు పోరాడారని.. ధర్మాబాద్ పోరాటంలో తెలుగుదేశం తెగువను అంతా చూశారని అన్నారు. చంద్రబాబును, టీడీపీ నేతలను అరెస్ట్ చేసినా... నాడు వెనక్కి తగ్గలేదన్నారు. అన్యాయంగా అరెస్ట్ చేసినందున చంద్రబాబు బెయిల్ కూడా నిరాకరించారని మంత్రి లోకేష్ గుర్తుచేశారు. ఈ కేసులో నోటీసులిస్తే చంద్రబాబు కోర్టుకు హాజరవుతారని చెప్పారు.
ముందస్తుపై లోకేష్ ఏమన్నారంటే..
మీడియాతో మంత్రి నారా లోకేష్ ముచ్చటిస్తూ అసెంబ్లీ రద్దు చేసి ముందస్తుకు వెళ్లే ఆలోచనే లేదని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే విషయంలో ప్రతి నిమిషం నిమగ్నమయ్యామన్నారు. తెలంగాణలో ప్రభుత్వం పూర్తికాలం అధికారంలో ఉండాలని ప్రజల కోరిక అని... అయితే ఐదేళ్ల పాటు తెలంగాణలో ప్రభుత్వం నడవకపోవడం విచారకరమని మంత్రి లోకేష్ వ్యాఖ్యానించారు.