బాబు భజన బృందం: ధర్మాన, సమ్మె ముగిసినట్లే: అచ్చెన్నాయుడు
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన బుధవారం తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. మంత్రులు భజన బృందంగా మారారని మండిపడ్డారు.
సంవత్సరంగా ఏపీ ప్రజలు నిరాశ, నిస్పృహలతో ఉన్నారన్నారు. డ్వాక్రా వ్యవస్థను కుప్పకూల్చిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదే అన్నారు. రుణమాఫీ చేస్తామని అబద్దపు వాగ్ధానాలు ఇచ్చారని, దీంతో లక్షలాది డ్వాక్రా సంఘాలు మూలనపడ్డాయన్నారు.
రాజధాని శంకుస్థాపన చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారని, అయితే కేంద్ర ప్రభుత్వం నుండి ఏమైనా నిధులు తీసుకు వచ్చారా చెప్పాలని ప్రశ్నించారు. కేంద్రం నుండి నిధులు తీసుకు రావడంలో చంద్రబాబు విఫలమయ్యారని అభిప్రాయపడ్డారు.
ఆర్టీసీ సమ్మె ముగిసినట్లే: అచ్చెన్నాయుడు
ఏపీలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ముగిసినట్లేనని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. కార్మికుల డిమాండ్లకు తాము సానుకూలంగా స్పందించామని చెప్పారు. ఆర్టీసీ సంస్థ ఇప్పటికే నాలుగువేల కోట్ల రూపాయల ఇబ్బందుల్లో ఉందని, కొత్త రాష్ట్రం కావడంతో అనేక సమస్యలు ఉన్నాయన్నారు.
కార్మికులకు అసంతృప్తి లేకుండా చూడాలని వారు కోరిన 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చేందుకు సిద్ధపడ్డామన్నారు. బకాయిలు రూ.1200 కోట్ల రూపాయల మేర ఉన్నాయని, ప్రభుత్వ ఇబ్బందులు, సంస్థ ఇబ్బందులు కార్మికులకు చెప్పి, కొంత త్యాగం చేయాలని చెప్పామన్నారు. సమ్మె ముగిసినట్లేనని, ఛార్జీలు పెంచే ఆలోచన లేదని చెప్పారు.