కిలో బియ్యం రూపాయి, కిలో ఇసుక రూ.2: బాబుపై ధర్మాన
శ్రీకాకుళం/ హైదరాబాద్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి పాలన ఆంధ్రప్రదేశ్ ప్రజలను అయోమయానికి గురి చేస్తోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాద రావు విమర్శించారు. అస్తవ్యస్త ఉద్యోగుల బదిలీ, నిలకడలేని ఇసుక విధానం చంద్రబాబు అవగాహనా రాహిత్యానికి అద్దం పడుతున్నాయని ఆయన మంగళవారం శ్రీకాకుళంలో మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
రేషన్లో కిలో బియ్యం రూపాయికే అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇసుకను మాత్రం టన్ను రూ.2 వేలకు పెంచిందని, అంటే కిలో ఇసుక ధర రూ.2 పడుతోందని ఆయన అన్నారు. ఆ ఘనత చంద్రబాబు ప్రభుత్వానిదేనని ఆయన అపహాస్యం చేశారు. పరిపాలనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే చంద్రబాబు రాష్ట్రాన్ని భూతల స్వర్గం చేస్తానంటూ ప్రజల దృష్టికి మళ్లించేందుకు యత్నిస్తున్నారని అన్నారు.
చంద్రబాబు కరడు గట్టిన రైతు వ్యతిరేకి
ఆంధ్రప్రదేశ్ రైతాంగం పూర్తి సంక్షోభంలో ఉందని వైయస్సార్ కాంగ్రెసు రైతు విభాగం అధ్యక్షుడు ఎవిఎస్ నాగిరెడ్డి అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 86 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన మంగళవారం హైదరాబాదులో మీడియా సమావేశంలో అన్నారు.
ఒక్క అనంతపురం జిల్లాలోనే 60 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన చెప్పారు. రైతు ఆత్మహత్యలకు చంద్రబాబు బాధ్యత వహించాలని అన్నారు. చంద్రబాబు కరడు గట్టిన రైతు వ్యతిరేకిలా మారారని ఆయన అన్నారు.