డబ్బుకు ఆశపడి వారు టీడీపీలో చేరారు, త్వరలో వారి భరతం పడతాం: ధర్మాన
శ్రీకాకుళం: కమిషన్ల కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్మాన ప్రసాద రావు మంగళవారం అన్నారు. దేశానికి వెన్నెముక వంటి రైతు ప్రయోజనాలను రక్షించేందుకు పూనుకున్నది దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు. రైతు సంక్షేమం కోసం పాటుపడిన వైయస్ను స్మరించుకోవాల్సి ఉందన్నారు.
అందుకే వైయస్సార్ గంగా హారతి కార్యక్రమం చేపట్టామన్నారు. గతంలో తొమ్మిదేళ్ల టీడీపీ పాలనలో రోజు రైతులు చనిపోతున్నారని, వారికి మేలు చేయాలని వైయస్సార్ చెప్పినా అప్పుడు చంద్రబాబు వినిపించుకోలేదన్నారు. వ్యవసాయం దండుగ అంటూ రైతులను అవమానించారన్నారు.
రైతులు, ప్రజల సంక్షేమం కోసం వైయస్ పాదయాత్ర చేశారన్నారు. 70 లక్షల మందికి వైయస్ పించన్ సదుపాయం కల్పించారని చెప్పారు. జలయజ్ఞం చేపట్టి రైతుల కష్టాలు తీర్చారని చెప్పారు. సీఎం అంటే వైయస్సార్లా ఉండాలనేలా పేరుగాంచారన్నారు.
కమీషన్లకు కక్కుర్తిపడి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేశారన్నారు. డబ్బులకు ఆశపడే కొందరు టీడీపీలో చేరారని, వారందరి భరతం పట్టే కార్యక్రమం దగ్గర్లోనే ఉందన్నారు.