సోనియాకు లేఖ, జగన్ పార్టీలోకి ధర్మాన: బాబుతో గల్లా
ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర విభజన సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలపడడానికి కారణం రాష్ట్రం సమైక్యంగా ఉండడమేనని, 2004, 2009లో పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ను భుజస్కంధాలపై ఎక్కించుకుని విజయపథంలో నడిపించారని ధర్మాన తాను రాసిన లేఖలో పేర్కొన్నారు.
కొందరు స్వార్థపరులు, రాజకీయ ప్రయోజనాల కోసం విభజనవాదాన్ని తీసుకువచ్చారని ఆరోపించిన ధర్మాన కేంద్రం ఆ దారిలో ఎలా ముందుకెళ్తుందని ప్రశ్నించారు. ఇప్పుడు కాంగ్రెను వీడుతున్న నేతలందరూ ప్రత్యేకవాదం కారణమేనని, ఇప్పటికైనా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ధర్మాన ఏఐసిసి అధ్యక్షురాలిని కోరారు.
కాగా, తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతున్నానని ధర్మాన ప్రసాద రావు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన ఆదివారం పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాదులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. ధర్మాన సోదరుడు ధర్మాన కృష్ణదాసు ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ఉన్నారు.
మోడీ టీ స్టాల్లో కృష్ణంరాజు
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో బిజెపి సీనియర్ నేత, మాజీ మంత్రి కృష్ణం రాజు పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ పేరుతో నమో టీ స్టాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కృష్ణం రాజు మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లోను మోడికి చాలా ఆదరణ కనిపిస్తోందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి వచ్చి మోడీ ప్రధాని కావడం ఖాయమన్నారు.
చంద్రబాబు, గల్లా అరుణ కుమారి ఒకే వేదికపై
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, మంత్రి గల్లా అరుణ కుమారి ఒకే వేదికను పంచుకోనున్నారు. చంద్రబాబు ఆదివారం చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా జరిగే ఓ కార్యక్రమంలో చంద్రబాబు, గల్లా అరుణ కుమారి కలసి తొలిసారిగా ఒకే వేదిక పంచుకోనున్నారు. బంగారుపాళ్యంలో జరిగే మాజీ పార్లమెంటు సభ్యుడు దివంగత నేత చెంగల్రాయ నాయుడు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
ఒకే వేదిక పైన చంద్రబాబు, గల్లా అరుణ కుమారి పాల్గొనే విషయం ఆసక్తికరంగా మారింది. గల్లా అరుణ తనయుడు గల్లా జయదేవ్ తెలుగుదేశం పార్టీలో చేరి, గుంటూరు లోకసభ స్థానం నుండి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. గల్లా అరుణ కూడా తన తనయుడు ఏ నిర్ణయం తీసుకున్నా స్వాగతిస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలో గల్లా అరుణ కూడా టిడిపి వైపు వెళ్తారా అనే చర్చ సాగుతోంది.