ఆ జాబితాలో నా పేరా?: చంద్రబాబు, అచ్చెన్నాయుడుపై ధర్మాన నిప్పులు, రాజీనామా అంటూ సంచలనం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇసుక విషయంలో తాను అవినీతికి పాల్పడినట్లు ప్రతిపక్షనేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, టీడీపీ నేత అచ్చెన్నాయుడు విమర్శలు చేయడంపై ఆయన మండిపడ్డారు.
రాజీనామా, రాజకీయాల నుంచి తప్పుకుంటా..
ఒక్క రూపాయి అయినా తాను అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే తాను తన మంత్రి పదవికి రాజీనామా చేయడంతోపాటు రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని స్పష్టం చేశారు. తన సవాల్ కు టీడీపీ నేతలు సిద్ధమా? అని ప్రశ్నించారు.
అప్పుడు దోచుకుని..
శ్రీకాకుళం గ్రామీణ మండలం కల్లేపల్లిలోని ఇసుక వారోత్సవాల్లో భాగంగా శనివారం ఇసుక రీచ్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ టీడీపీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా అడ్డంగా దోచుకున్నారని ఆరోపించారు.
ఇప్పుడు విమర్శలా..
ఇప్పుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నారని, ఇది ఓర్వలేకనే ప్రతిపక్ష నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబునాయుడు, అచ్చెన్నాయుడు, ఇతర టీడీపీ నేతలు తనపై చేసిన అవినీతి ఆరోపణలను నిరూపించగలరా? అని సవాల్ విసిరారు.
టీడీపీ జాబితాలో మంత్రి పేరు..
కాగా, 13 జిల్లాల్లో 67 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. అంతేగాక ఆ నేతల పేర్లంటూ ఓ ఛార్జీషీటును కూడా విడుదల చేశారు. తమ్మినేని సీతారాం, ధర్మాన కృష్ణదాస్, బొత్స సత్యనారాయణ, జక్కంపూడి రాజా, పార్థసారథి, సామినేని ఉదయభాను, కొడాలి నాని, మోపిదేవి వెంకటరమణ, మేకపాటి రాజమోహన్ రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, రోజా, పెద్దిరెడ్డి ఉన్నారు. వీరితోపాటు వీరి అనుచరులు కూడా ఇసుక మాఫియాతో సంబంధాలున్నాయని టీడీపీ నేతల ఆరోపణ. ఈ నేపథ్యంలోనే టీడీపీ ఆరోపణలకు ధర్మాన కృష్ణదాస్ కౌంటర్ ఇచ్చారు.