నాటి చంద్రబాబు చర్యల ఫలితమే: వైజాగ్ గ్యాస్ లీకేజీ ఘటనపై మంత్రి ధర్మాన ఆగ్రహం
అమరావతి: విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనపై అధికార, ప్రతిపక్షాల మధ్య పరస్పర విమర్శల దాడి కొనసాగుతోంది. అధికార పార్టీ నిర్లక్ష్యం కారణమంటూ టీడీపీ విమర్శిస్తుండగా.. ప్రతిపక్ష పాపమేనంటూ వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. తాజాగా ఏపీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఈ ఘటనపై స్పందించారు.
అదుపులోకి స్టెరైన్.. సాధారణ పరిస్థితులు..
ప్రస్తుతం విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ప్రమాదస్థలంలో సాధరణ పరిస్థితులు నెలకొన్నాయని మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. మరోసారి మంత్రుల బృందంతో సమావేశమై తాజా పరిణామాలపై చర్చిస్తామని ఆయన తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడారు. సాయంత్రం 48 గంటల పూర్తవుతున్న నేపథ్యంలో నిపుణుల కమిటీ సూచనల మేరకు ఐదు గ్రామాల ప్రజలను వెనక్కి పంపించే విషయమై నిర్ణయం తీసుకుంటామని ధర్మాన తెలిపారు. ప్రస్తుతం స్టెరైన అదుపులోకి వచ్చిందని చంద్రబాబు తెలిపారు.
చంద్రబాబు హయాంలోనే..
వైఎస్ జగన్ ప్రభుత్వంపై బురద జల్లడం మానుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మంత్రి కృష్ణదాస్ హితవు పలికారు. చంద్రబాబు హయాంలో ఎల్జీ పాలిమర్స్లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఏం చర్యలు తీసుకున్నారని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఫ్యాక్టరీ విస్తరణకి అనుమతులు ఇచ్చింది నిజం కాదా? అని నిలదీశారు. కేంద్ర పర్యావరణ అనుమతులు లేకుండానే ఫ్యాక్టరీ విస్తరణకు అనుమతులిచ్చారని చంద్రబాబుపై మండిపడ్డారు.
Recommended Video
చంద్రబాబు తప్పిదాల వల్లే..
చంద్రబాబు నాయుడు చేసిన తప్పిదాల వల్లే ఈరోజు గ్యాస్ ప్రమాదం జరిగిందని మంత్రి కృష్ణదాస్ ఆరోపించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు చర్యలు తీసుకుని ఉంటే ఈరోజు ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని మంత్రి వ్యాఖ్యానించారు. చంద్రబాబు తప్పు చేసి తమ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని ధర్మాన కృష్ణదాస్ ధ్వజమెత్తారు.
జగన్ వెంటనే స్పందించారు.. బాబు మాత్రం..
ప్రమాద ఘటనపై సీఎం వైఎస్ జగన్ వెంటనే స్పందించి మృతులకు రూ. కోటి పరిహారం ప్రకటించారని, అంతేగాక, వెంటనే రూ. 30 కోట్లు విడుదల చేస్తూ జీవో కూడా జారీ చేశారని తెలిపారు. జగన్ స్పందించిన తీరును అభినందించాల్సింది పోయి.. చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల భద్రతే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కృష్ణదాస్ స్పష్టం చేశారు.