జగన్ ఓకే, నిందలేమిటి: ఎపి రాజధానిపై ధర్మాన
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వాదనను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తప్పు పట్టారు. రాజధాని నిర్మాణంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, దాన్ని అడ్డుకుంటున్నట్లు తమపై అపవాదులు వేస్తోందని, అది సరి కాదని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
రాజధానిని నిర్మించ తలపెట్టిన గ్రామాల్లో తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన రాజధాని రైతుల, కూలీల హక్కుల పరిరక్షణ కమిటీ నేటి నుంచి పర్యటిస్తుందని ఆయన చెప్పారు. రాజధాని నిర్మాణంపై ప్రభుత్వానికి స్పష్టత ఉందని, ఇప్పుడు మరో ప్రాంతంలో రాజధాని పెట్టండని ఎవరు మాట్లాడినా అది ప్రాధాన్యత లేని అంశమే అవుతుందని ఆయన అన్నారు.
ప్రభుత్వ నిర్ణయాన్ని తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అసెంబ్లీ సమావేశాల్లోనే సమర్థించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాజధాని రైతులు, కూలీల హక్కుల పరిరక్షణ కమిటీ ఆయా గ్రామాల్లో పర్యటించి ప్రజల అభిప్రాయాలను, సూచనలను, ఆవేదనలను తెలుసుకుని అవసరమైతే ప్రభుత్వానికి సహకారం అందిస్తుందని ఆయన చెప్పారు.
దానిపై అవగాహన లేని కొన్ని పత్రికలు రాజధాని నిర్మాణానికి తమ పార్టీ అడ్డుపడుతోందని రాయడాన్ని తాను చూశానని, అవన్నీ నిరాధారమైన వార్తలేనని ఆయన అన్నారు. ఎపి రాజధానిపై తమ పార్టీ మీద ఆరోపణలు చేయడం సరి కాదని ఆయన అన్నారు.
కమిటీ రెండు రోజుల పాటు గ్రామాల్లో పర్యటిస్తుంది. పార్టీ ప్రధాన కార్యదర్శులు ధర్మాన ప్రసాద రావు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పిఎసి సభ్యుడు అంబటి రాంబాబు, మాజీ మంత్రి పార్థసారథి, శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణా రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, కొడాలి నాని, ఉప్పులేటి కల్పన, జలీల్ ఖాన్, రైతు సంఘం అధ్యక్షుడు ఎంవిఎస్ నాగిరెడ్డి తదితరులు రైతులు, కౌలు రైతులు, కూలీలు, ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటారు.