చంద్రబాబూ! టిడిపి ఎంపీలతో రాజీనామా చేయించు!!: ధర్మాన
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చిన నేపథ్యంలో ప్రత్యేక హోదాపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయడంలో అర్థం లేదని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు ధర్మాన ప్రసాద రావు అన్నారు. మూడేళ్ల తర్వాత చంద్రబాబు ప్రతిస్పందించడమేమిటని ఆడిగారు.
మూడేళ్ల క్రితం ఏర్పాటు చేయాల్సిన అఖిలపక్ష సమావేశాన్ని చంద్రబాబు ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నారని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ప్రత్యేక హోదా డిమాండుపై టిడిపి ఎంపీల చేత చంద్రబాబు రాజీనామాలు చేయించాలని ఆయన సూచించారు.
అందుకే జగన్ తీసుకున్నారు...
ప్రజల హక్కుల కాపాడడంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు విఫలమయ్యారని ధర్మాన అన్నారు. హోదా సాధన కోసం నాయకత్వం వహించాల్సిన చంద్రబాబు విఫలమయ్యారు కాబట్టే ఆ బాధ్యతను జగన్ తీసుకున్నారని ఆయన అన్నారు. తన బండారం బయటపడుతుందని చంద్రబాబు హోదాను పక్కన పెట్టేశారని అన్నారు.
చంద్రబాబు అప్పుడలా అన్నారు...
ప్రత్యేక హోదా అవసరం లేదని, ప్యాకేజీ ఇవ్వాలని చంద్రబాబు అన్నారని ధర్మాన గుర్తు చేశారు. హోదా సంజీవిని కాదని కూడా చంద్రబాబే అన్నారని ఆయన అన్నారు. కేంద్రం నుంచి నిధులు బాగా వస్తున్నాయని అన్నది కూడా చంద్రబాబేనని ఆయన అన్నారు. ఇప్పుడు రాష్ట్రానికి అన్యాయం జరిగిందని మాట్లాడుతున్నారని విమర్సించారు.
ఎపిలో ప్రతిపక్షం లేకుండా చేయాలని...
రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలని చంద్రబాబు ప్రయత్నించారని ధర్మాన విరుచుకుపడ్డారు. తమ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను లాక్కుని వారిలో నలుగురికి పదవులు ఇచ్చారని ఆయన అన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటే నానుస్తున్నారని, అటువంటి చంద్రబాబు అఖిలపక్ష సమావేశానికి పిలిచే నైతిక అర్హత లేదని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు ఖూనీ చేశారని అన్నారు.
వైఎస్ జగన్ లేకుంటే....
ఏ సమస్య మీదనైనా చంద్రబాబు అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేశారా అని ధర్మాన ప్రశ్నిచారు. ముఖ్యమంత్రిగా హోదా విషయంలో ముఖ్యమంత్రి వెనకబడిపోయారని అన్నారు. కేంద్రం హోదా ఇవ్వడం లేదని చెప్పినప్పుడే కేంద్ర మంత్రుల చేత రాజీనామాలు చేయించాలని జగన్ డిమాండ్ చేశారని, అప్పుడు చంద్రబాబు ముందుకు వచ్చి ఉంటే మరోలా ఉండేదని అన్నారు. జగన్ లేకుంటే హోదా మరుగున పడిపోయి ఉండేదని అన్నారు.
రాష్ట్ర విభజనకు బాబు కారణం
రాష్ట్రం విడిపోవడానికి చంద్రబాబు కారణమని ధర్మాన అన్నారు. అవినితీకి చంద్రబాబు ఆలవాలంగా మారారని దుయ్యబట్టారు. ఏనాడైనా చంద్రబాబు సంప్రదాయాలను పాటించారా అని ప్రశ్నించారు. సంప్రదాయ విరుద్ధమైన పనులు చేశారని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆయన విమర్శించారు. అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసే దశ దాటిపోయిన తర్వాత దాని గురించి చంద్రబాబు మాట్లాడుతున్నారని అన్నారు. ప్రజల పోరాటం కారణంగానే చంద్రబాబు కేంద్ర మంత్రులతో రాజీనామా చేయించారని అన్నారు.
రాజీనామాల నిర్ణయాన్ని వక్రీకరిస్తున్నారు...
తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేయడానికి నిర్ణయం తీసుకున్నారని ధర్మాన చెప్పారు. దాన్ని కూడా కొంత మంది వక్రీకరిస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్యంలో అంతిమ తీర్పు ప్రజలదేనని అన్నారు. రాజీనామాలు చేసిన తర్వాత తాము ప్రజా తీర్పును కోరుతామని చెప్పారు. అమరావతిని చంద్రబాబు కుటుంబ వ్యవహారంగా మార్చేశారని అన్నారు. ప్రజలు చంద్రబాాబును నమ్మే స్థితిలో లేరని అన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చే వారితోనే తాము కలిసి ప్రయాణం చేస్తామని చెప్పారు.