నచ్చిన చోట ఇస్తేనే: ప్లాట్ల పంపిణీలో సీఆర్డీఏ అధికారులతో రైతుల వాగ్వాదం
నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతంలో రైతుల నుంచి భూములు తీసుకునేటప్పుడు వారికి కావాల్సిన చోట ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పిన అధికారులు ఇప్పుడు మాట మార్చడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు ఇచ్చే ప్లాట్ల విషయంలో తుళ్లూరు మండలం శాఖమూరులో సీఆర్డీఏ అధికారుల సదస్సు సోమవారం గదరగోళంగా మారింది.
సోమవారం జరిగిన సదస్సులో సీఆర్డీఏ అధికారులు, రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో శాఖమూరులో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 'మాకు నచ్చిన చోట ప్లాట్లు ఇస్తేనే తీసుకుంటాం' అని అధికారులతో రైతులు తెగేసి చెప్పారు. మీరు ఇచ్చిన చోట తీసుకోవాలంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
చంద్రబాబు చేసిందేమీ లేదు: ధర్మాన
ఏపీకి ప్రత్యేకహోదా సాధించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు చేసిందేమీ లేదని వైసీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. సోమవారం శ్రీకాకుళంలో ప్రత్యేక హోదాకు, ఆర్థికసాయానికి తేడాలేంటి? అనే చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ హోదాపై బీజేపీ, టీడీపీలు కలిసి మోసం చేశాయన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకునేందుకే చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ఆయన ధ్వజమెత్తారు. అసెంబ్లీలో కూడా ప్రతిపక్షాల సలహాలను తీసుకోవడం లేదని అన్నారు. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ చెప్పిన అంశాల్లో ప్రత్యేక ప్యాకేజీ ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు.
ఐఐటీ, ఐఐఎం, సెంట్రల్ యూనివర్శిటీలు ఇచ్చామని చెబుతున్నారని, అవన్నీ కూడా ఇతర రాష్ట్రాల్లోనూ ఉన్నాయని వీటిని ఆర్థికసాయం కింద లెక్కలు చెబుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఏపీకి హోదా సాధన విషయంలో చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉంటున్నారో చెప్పాలని నిలదీశారు.
ఈ చర్చా కార్యక్రమంలో జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, రాజకీయ పార్టీల నేతలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని గళమెత్తారు. టీడీపీ తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.