"నంద్యాలలో టీడీపీ గెలుపుకు కారణం ఆ మూడు 'పీ'లే.."
ఒకవేళ నిజంగా గెలిచామని వారు భావిస్తే.. 20మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు సిద్దపడాలని సవాల్ విసిరారు.
విజయవాడ: నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో టీడీపీ గెలిచినప్పటికీ.. చంద్రబాబు మాత్రం నైతికంగా గెలవలేదని వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఒకవేళ నిజంగా గెలిచామని వారు భావిస్తే.. 20మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు సిద్దపడాలని సవాల్ విసిరారు.
ఇక పోల్ మేనేజ్మెంట్ ద్వారానే గెలిచామని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ధర్మాన ఎద్దేవా చేశారు. నంద్యాల ఉపఎన్నికల్లో మూడు 'పీ'ల ద్వారా ఆయన గెలిచామని చంద్రబాబు ఒప్పుకున్నారని అన్నారు. అందుకే పోల్, పొలిటికల్, పబ్లిక్ మేనేజ్మెంట్ల గురించి ఆయన మాట్లాడుతున్నారని అన్నారు. మేనేజ్మెంట్కు తోడు నంద్యాల ప్రజలను ప్రలోభాలకు గురిచేయడం ద్వారానే విజయం సాధించారని ఆరోపించారు.
నంద్యాల ఉపఎన్నికకు నోటిఫికేషన్ రావడానికి వారం రోజుల ముందునుంచే ప్రలోభాల పర్వం మొదలైందన్నారు. 2,500ఇళ్ల మంజూరుతో పాటు, 6వేల ట్రాక్టర్ల పంపిణీ, 3వేల మందికి అదనంగా పెన్షన్లు, 4వేల మందికి తెల్ల కార్డులు, 2వేల మంది విద్యార్థులకు కంప్యూటర్లు ఇవ్వడం ద్వారా ప్రలోభాలకు గురిచేశారన్నారు.
హడావుడిగా 1200 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారని, టీడీపీని గెలిపించకుంటే అభివృద్ధి పనులు ఆగిపోతాయని ప్రజలను భయపెట్టారని ఆరోపించారు. ఓటేయని పక్షంలో రేషన్ కార్డులు, ఇళ్ల పట్టాలు వెనక్కి తీసుకుంటామని హెచ్చరించారని ఆరోపించారు. ఒక్కో ఓటుకు రూ.5వేలు ఇచ్చి దేవుడిపై ప్రమాణం కూడా చేయించుకున్నారని మండిపడ్డారు.
అన్ని రకాల మేనేజ్మెంట్లు చేయడం వల్లే నంద్యాల ఉపఎన్నికలో విజయం సాధించారని అన్నారు. వైసీపీ నేతలు తమతో టచ్ లో ఉన్నారని చంద్రబాబు చెబుతున్నారని, కానీ లక్షలాది జనం తమతో టచ్ లో ఉన్నారని ధర్మాన అన్నారు. చంద్రబాబు పాలన అంతం కావాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు.
2004నుంచి సుమారు 50ఉపఎన్నికలు జరిగితే ఎప్పుడైనా గెలిచారా? అంటూ టీడీపీని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నారు కాబట్టే నంద్యాల ఉపఎన్నికలో గెలవగలిగారని అన్నారు. నంద్యాలకు రూ.1200కోట్లు ఇచ్చినప్పుడు, తమకెందుకు ఇవ్వరని మిగతా ప్రాంతాల ప్రజలు కూడా నిలదీయాలని పిలుపునిచ్చారు.