ఏపీలో అయిదేళ్లల్లో రూ.2 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు: కేంద్ర మంత్రి..సీఎం జగన్ కీలక భేటీ..!
కేంద్ర పెట్రోలియం..సహజవాయువు.. ఉక్కుశాఖల మంత్రి ధర్మేంద్ర ప్రదాన్..ఏపీ ముఖ్యమంత్రి జగన్ మధ్య చర్చల్లో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగా.. వచ్చే ఐదేళ్లలో ఏపీలో పెట్రోలియం, సహజవాయువు, ఉక్కు రంగాల నుంచి రూ.2 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు వచ్చేలా ప్రణాళికల పైన చర్చలు చేసారు.కడప జిల్లాలో నిర్మించతలపెట్టిన స్టీల్ప్లాంట్కు ఎన్ఎండీసీ నుంచి ఇనుపఖనిజం సరఫరాపై ముఖ్యమంత్రి చేసిన విజ్ఞప్తిపై ధర్మేంద్ర ప్రదాన్ సానుకూలంగా స్పందించారు.
ఎన్ఎండీసీ నుంచి ఇనుప ఖనిజాన్ని సరఫరాచేయడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, ఎన్ఎండీసీ మధ్య త్వరలో ఒప్పందం కుదరనుంది. తూర్పుగోదావరి జిల్లా పోలవరం మండలం బైరవపాలెంలో జీఎస్పీసీ లిమిటెడ్ నిర్వహించిన ఆఫ్షోర్ డ్రిల్లింగ్ వల్ల 16,554 మత్స్యకార కుటుంబాలకు చెల్లించాల్సిన రూ.81 కోట్ల రూపాయలు పెండింగులో ఉన్నాయని, వాటిని వెంటనే మంజూరుచేయాలని విజ్ఞప్తిచేశారు. ఈ పరిహారం చెల్లింపునకు వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్రమంత్రి ప్రదాన్ ఓఎన్జీసీ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
పెట్రో కెమికల్ కాంప్లెక్స్ పైన హామీ..
చమురు, గ్యాస్ కంపెనీలు ఏపీలో తమ టర్నోవర్కు తగినట్టుగా సీఎస్ఆర్ నిధులు ఇవ్వాలంటూ చేసిన విజ్ఞప్తిపైనా కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలో ఆయా కంపెనీల టర్నోవర్ మేరకే సీఎస్ఆర్ వచ్చేలా చూస్తామని కేంద్రమంత్రి స్పష్టంచేశారు. చమురు, గ్యాస్ వెలికి తీస్తున్న కంపెనీలు చెల్లిస్తున్న రాయల్టీలో రాష్ట్రానికి వాటా ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కోరింది. ఆఫ్షోర్లో చమురు, గ్యాస్ వెలికితీత కార్యక్రమాల వల్ల సమీపంలో ఉన్న ప్రాంతాల్లో కాలుష్య ప్రభావం ఉంటోందని, తీర ప్రాంతాల్లో ఉన్న ప్రాసెసింగ్ ప్లాంట్ల వల్ల పర్యావరణ పరంగా క్లిష్టపరిస్థితులు ఏర్పడుతున్నాయని, భారీ వాహనాల రాకపోకల వల్ల రోడ్లు దెబ్బతింటున్నాయని, ప్రజలు, మత్స్యకారుల జీనోపాధికికూడా ఇబ్బంది వస్తోందని రాష్ట్రప్రభుత్వం కేంద్రమంత్రి దృష్టికి తీసుకు వెళ్లింది.. ఆంధ్రప్రదేశ్ పునర్వివిభజన చట్టం ప్రకారం క్రూడాయిల్ రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ను తప్పనిసరిగా ఏర్పాటుచేయాల్సి ఉందని, కాకినాడలో ఏర్పాటుకు సత్వర చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వ అధికారులు కేంద్రమంత్రికి విజ్ఞప్తిచేశారు.
దీనిపై స్పందించిన కేంద్రమంత్రి పెట్రోలియంశాఖ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో అత్యున్నతస్థాయి సంయుక్త కమిటీని ఏర్పాట చేస్తామని వెల్లడించారు. పెట్రో కాంప్లెక్స్ ఏర్పాటుకు తగిన ప్రణాళిక సిద్ధంచేస్తామని చెప్పారు.
పెట్రోలియం ఎక్స్ లెన్స్ సెంటర్ కు ప్రయత్నాలు..
కాకినాడ, రాజమండ్రి ప్రాంతాల్లో పెట్రోలియం ఎక్స్లెన్స్ సెంటర్ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తామని ధర్మేంద్ర ప్రదాన్ హామీ ఇచ్చారు. దేశానికి తూర్పుతీరంలో ఉన్న ఏపీలో పెట్రో రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచప్రఖ్యాత కంపెనీలు ముందుకు వస్తున్నాయని ప్రదాన్ అన్నారు. వచ్చే ఐదేళ్లలో పెట్రోలు, సహజవాయువు, ఉక్కు రంగాలకు సంబంధించి దాదాపు రూ.2 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు రానున్నట్టు తెలిపారు.
విశాఖలో విస్తరణ ప్రాజెక్టుల ద్వారా, కాకినాడలో పెట్రోకాంప్లెక్స్ ఏర్పాటు ద్వారా, కడపలో స్టీల్ ప్లాంట్ రూపంలో భారీగా పెట్టుబడులు వస్తాయని ప్రదాన్ వెల్లడించారు. పరిశ్రమల ఏర్పాటు విషయంలో ఏపీ ప్రభుత్వం ఓపెన్ మైండ్తో ఉందని అన్నారు. పైపులైన్లు వేయడంలో ఉన్న సమస్యలను తొలగించడంతోపాటు, చాలాకాలంగా పెండింగులో ఉన్న సమస్యలను పరిష్కరించినందుకు ఓఎన్జీసీ , హెచ్పీసీఎల్ ఛైర్మన్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా అందించడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం జగన్ అన్నారు. పరిశ్రమల ఏర్పాటు విషయంలో సానుకూల దృక్పథంతో ఉంటామని, ఏది కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.